ప.గో. చాలా ముఖ్యం: పవన్ హెచ్చరికపై బాబు, అక్వా పరిశ్రమకు ఆదేశం
ఏలూరు: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి దిగివచ్చారని అంటున్నారు. మెగా అక్వా ఫుడ్ పరిశ్రమ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేను రంగంలోకి దిగుతానని పవన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆదివారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అధికారులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పశ్చిమ గోదావరి జిల్లా చాలా ముఖ్యమైన జిల్లా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెగా ఫ్డు పార్కు పైన రైతులు, ప్రతిపక్షాల అనుమానాలను తాము నివృత్తి చేస్తామని చెప్పారు.
ప్రతి గ్రామం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సబ్ కలెక్టర్తో కమిటీ వేయాలని సూచించారు. నీటి కాలుష్యం లేకుండా నీటిని సముద్రంలోకి వదలాలని పరిశ్రమను ఆదేశించారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు కూడా మాట్లాడారు. ఫుడ్ బార్కు జిల్లా అభివృద్ధికి ముఖ్యమని చెప్పారు. కేంద్రం నుంచి ఫుడ్ పార్క్ కోసం రూ.300 కోట్లు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యమేనని, అలాగే జిల్లా అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
నేను ప్రజల్లో ఉండే మనిషినే అని చెప్పారు. తమకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమన్నారు. అలాగే అభివృద్ధి ముఖ్యమన్నారు. కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, కమ్యూనిస్టులు అయినా ఫ్యాక్టరీ వద్దని చెప్పలేదన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ ఉండాలన్నారు. తాము అదే చేస్తామన్నారు.
కాగా, గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్కు పైన ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో మత్స్యశాఖ, ఎంపెడ, పరిశ్రమశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.