రేవంత్ ప్రమాణం, అశోక్ తెలుగు ఇబ్బంది.. నవ్వేశారు, బాబుకు ఎర్రబెల్లి దమ్కీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. పార్టీ జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల నూతన కమిటీ సభ్యులు కొత్త పదవులను చేపట్టారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గుండుతో హాజరయ్యారు. ఇటీవల ఆయన సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి దశ దిన కర్మల సందర్భంగా రేవంత్ రెడ్డి గుండు గీయించుకున్నారు. రేవంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
కాగా, చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు ఆయన గొంతు బొంగురుపోయింది. ఎక్కువగా పని చేయడం వల్ల వేడి చేసి ఇలా అవుతోందని ఆయన పేర్కొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు.. అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం అయిపోయాక వచ్చారు.
దీంతో, విడిగా ప్రమాణం స్వీకారం చేశారు. తెలుగులో ప్రమాణ పత్రాన్ని చదవడానికి ఆయన ఇబ్బంది పడటం అందర్నీ నవ్వించింది. తొలిసారి పార్టీలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్... తొలుత ఎన్టీఆర్ ఘాట్ వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
చంద్రబాబు
2019లో ఏపీలో మళ్లీ టిడిపిదే అధికారమని, తెలంగాణలో అధికారం సాధిస్తామని, అలాగే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ హడావుడి ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో కనిపించింది. అందరి దృష్టి ఆయన పైనే ఉంది.
చంద్రబాబుతో ఎల్ రమణ
అటు ఏపీలో కళా వెంకట్రావు, ఇటు తెలంగాణలో ఎల్ రమణ.. తెలుగుదేశం బీసీల పార్టీ అనేందుకు ఇంతకన్నా నిదర్శనం లేదని టి-టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ పేర్కొన్నారు. తెలంగాణలో సమష్టి నాయకత్వంతో ముందుకెళ్తామన్నారు.
ఏపీ-టీ కమిటీ దృశ్యం
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఏపీలో రూ.5లక్షల పరిహారం ఇస్తూ ఉత్తర్వు ఇవ్వడం రైతన్నలపై టిడిపి ప్రేమకు నిదర్శనం అని ఎల్ రమణ అన్నారు. అది చూసి తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ కూడా పరిహారం ఇస్తామన్నారన్నారు.
చంద్రబాబుకు దమ్కీ
కాగా, తెలంగాణనుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దిరెడ్డిలు ప్రమాణ స్వీకారానికి హాజరు రాలేదు. పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా హాజరుకాలేదు. తాను క్రియాశీల రాజకీయాల్లో లేనందున రాలేదని మండవ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఏపీ నుంచి నన్నపనేని రాజకుమారి తదితరులు రాలేదు.