పోరాటాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు .. టీడీపీ సైన్యం పోరాటం చేసే స్థితిలో ఉన్నారా ?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పక్క వైసీపీ టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసి సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంది. గత ప్రభుత్వ అవినీతి బండారం బయట పెట్టాలని తెగ ప్రయత్నం చేస్తుంది. మరోపక్క టీడీపీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యనాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఇక పార్టీలో కూడా ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో అని అనిశ్చితి నెలకొంది. ఇక ఈ సమయంలో చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పోరాటాలకు సిద్ధం కండి అంటూ పిలుపు నిస్తున్నారు.
కార్యకర్తలకు అండగా ఉండాలని పోరాటాలకు సిద్ధం కావాలంటున్న చంద్రబాబు
మొదట కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తానన్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో , కేవలం టీడీపీ ని టార్గెట్ చేసి చేస్తున్న పనులతో ఎదురుదాడికి సిద్దమవుతున్నారు. జగన్ 30 రోజుల పాలనపై కార్యకర్తలతో సమావేశమై పోరాటాలకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు చంద్రబాబు . టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. వారి కోసం ఆయన యాత్ర కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశానికి హాజరై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్న బాబు త్వరలోనే కార్యకర్తల ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు .
కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం .. ప్రజల తరపున పోరాటం చేస్తాం అంటున్న చంద్రబాబు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు విపరీతంగా పెరిగాయని, ఆరుగురు కార్యకర్తలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు . చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పార్టీ అందజేస్తుందని ప్రకటించిన చంద్రబాబు ఇక నుండి పోరాటం చెయ్యాలని అంటున్నారు.. హింసాత్మక రాజకీయాలపై టీడీపీకి నమ్మకం లేదని చెప్పిన బాబు వారంలో నాలుగురోజుల పాటు కార్యాలయంలోనే నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు .అధికారం, ప్రతిపక్షం టీడీపీకి కొత్తేం కాదని, పోలీసులు, ప్రభుత్వం సంయమనం పాటించి ప్రజలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇక టీడీపీ కార్యకలాపాలన్నీ గుంటూరులోని రాష్ట్ర కార్యాలయం నుంచే కొనసాగుతాయని, కొత్త కార్యాలయం సిద్ధమయ్యేవరకు ఇక్కడి నుంచే పార్టీ పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు . ఎన్నికల్లో 40శాతం ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాల్సిన అవసరముందని నేతలు, కార్యకర్తలకు సూచనలు చేసిన బాబు ఇక సమరానికి సాయి అంటున్నారు. .37ఏళ్లు పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అందుకే కార్యకర్తలకు అండగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
టీడీపీ నేతలు పోరాటం చేస్తారా ? పలాయనం చిత్తగిస్తారా ?
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు పోరాటాల బాట పడతారా ? మాకెందుకులే సేఫ్ జోన్ లో ఉంటె పోలా అంటూ పక్క పార్టీల్లోకి జంప్ అంటారా.. కీలక మంత్రి పదవులు నిర్వహించిన నారాయణ వంటి నేతలే సైలెంట్ గా ఉంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి జంప్ అవుదామని ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు పోరాట స్పూర్తిని అంది పుచ్చుకునే నాయకులెవరు. ఇక ఈ నెలలో భారీగా బీజేపీలోకి వలసలు ఉంటాయని బీజేపీ నేతలు చెప్తున్న తరుణంలో అందులో ఎందరు టీడీపీ నాయకులున్నారో ? బాబు ఆలోచనకు బాసటగా నిలిచి ఐదేళ్ళు వైసీపీతో , జగన్ తో కొట్లాడే సత్తా ఉన్న, ముఖ్యంగా కమిట్మెంట్ ఉన్న నాయకులు తాజా రాజకీయాల్లో టీడీపీలో ఉన్నారా అన్నది ఆలోచించాల్సిన విషయమే .బాబు పిలుపుతో పోరాటానికి సిద్ధం అవుతారో.. పలాయనానికి రెడీ గా ఉన్నారో మరి కొన్ని రోజుల్లోనే టీడీపీ నేతల ఆలోచన ఏంటో తెలియనుంది.