ఇదే చంద్రబాబు చాణక్యం..! బీజేపి ముఖ్యమంత్రుల అంతర్మధనం..!!
హైదరాబాద్: ఏపీ లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు బీజేపి ముఖ్యమంత్రుల పాలిట శరాఘాతంగా పరిరణమిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో చంద్రబాబు తీసుకున్న స్టెప్ కి బెంబేలెత్తిపోతున్నారు. కేంద్రంలో అదికారంలో ఉండి కూడా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల అంశంలో ఏమీ చేయలేక పోతున్నామని బీజెపి పాలిత ముఖ్యమంత్రులు మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుందంటున్న తరుణంలో చంద్రబాబు నిర్ణయం అగ్గికి ఆజ్యాన్ని పోసినట్టైందని చర్చ జరుగుతోంది.
శత్రువు మిత్రుడిగా మారితే ఓకే..! కానీ మిత్రుడు శత్రవుగా మారితేనే ప్రమాదం..!
గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ బీజేపీపై పోరాటం చేస్తోంది. ఆ మధ్య జరిగిన వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన టీడీపీ.. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ పరిణామాలతో బీజేపీ అధిష్టానం సైతం ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించింది.
చంద్రబాబును ఇరుకున పెట్టాలని ఇబ్బందుల పాలవుతున్న ఏపి బీజేపి..!
చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని సలహాలు, సూచనలతో బీజేపి అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. అయినా వాళ్లు టీడీపీని చేసిందేమీ లేకపోగా, వారి అపరిపక్వ రాజకీయాల వల్ల బీజేపీపై రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోయింది. గతంలో ఆ పార్టీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, తదితర సంస్కరణలకు తోడు ముడి చమురు ధరలు బాగా పెరిగిపోవడంతో కేంద్రంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే అదునుగా టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు చెమటలు పట్టిస్తోంది.
కంటిలో నలుసుగా చంద్రబాబు నిర్ణయం..! అయోమయంలో బీజేపి సీయంలు..!!
దేశ వ్యాప్తంగా ప్రధాన సమస్యగా ఉన్న పెట్రో ధరల పెరుగుదల ప్రజల నడ్డి విరుస్తోంది. దీనికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ భారత్ బందును కూడా నిర్వహించాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనవంతుగా స్పందించింది. పెట్రోలు, డీజిల్పై లీటరుకు 2రూపాయల చొప్పున తగ్గించింది. కేంద్రం కూడా ఇలాగే చేయాలని, పెట్రో భారం తగ్గించాలని కోరింది. ‘మా నిర్ణయం కేంద్రానికి సవాల్లాంటిది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రో మంటను తగ్గించాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా ఆమోదించారు.
కేంద్రతో చర్చించలేరు.. రాష్ట్రాల్లో అమలు చేయలేరు..! బాగా ఇరికించిన బాబు..!
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్పై లీటర్కు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచే తగ్గింపు అమలులోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1120కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు తలనొప్పిగా మారింది. లోటు బడ్జెట్ ఉన్నా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపిలో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నబీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం పంటికిద రాయిలా పరిణమిస్తున్నాయి.