ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన .. ఎందుకంటే
Recommended Video
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు . రేపట్నుంచి రెండు రోజుల పాటు ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలోపార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కలవనున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన తొలిసారి కుప్పం వెళ్లనున్నారు.
2, 3 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన.. ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న బాబు
ఈనెల 2, 3 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను కుప్పం నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన కుప్పం వెళ్లనున్నారు. ఇక రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన ప్రజలను కలవనున్నారు . పార్టీ కార్యకర్తలను, అభిమానులతో ఆయన భేటీకానున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశంతో బాబు ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో చంద్రబాబు టూర్ కొనసాగనుందని తెలుస్తుంది, ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తెలిపారు.మాజీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో మంగళవారం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పర్యటించనున్నారు . ఈ నెల 3న గుడిపల్లె, కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో పాటు, రైతులు, ప్రజలను కలవనున్నారు.నియోజకవర్గ పరిధిలో నిలిచిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నట్లు వివరించారు. చంద్రబాబు పర్యటన వివరాలు చూస్తే..
పర్యటన వివరాలివి .. నాలుగు మండలాలలో బాబు పర్యటన
రేపు ఉదయం 7.40 గం. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు పయనం 9.15 గం. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రామకుప్పం వెళ్తారు.11.30 గం. రామకుప్పం చేరుకొని ప్రజలతో మాటామంతీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30-1.30 గం. కార్యకర్తలతో సమావేశం అవుతారు . 2.30 గం. శాంతిపురానికి వెళ్తారు 3.00 గం. శాంతిపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహిస్తారు. ఇక అక్కడ నుండి 3.50 గం. నందిగం కల్యాణ మండపానికి చేరుకుని 4.00 గం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గం. కుప్పానికి పయనం అవుతారు. ఇక మూడో తేదీన ఉదయం 9.15-10.00 గం. అధికారులతో అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. 10.15 గం.లకు గుడుపల్లెకు వెళ్తారు అక్కడ 11.00 గం.బహిరంగ సభ నిర్వహిస్తారు .మధ్యాహ్నం2.30 గం. కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇక 3.00 గం. నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.
ఎన్నికల్లో మెజార్టీ తగ్గటానికి కారణాలు , పార్టీ బలోపేతం చెయ్యటం పై దృష్టి
ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ దారుణంగా తగ్గింది. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 29993 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఎంగా పని చేసిన చంద్రబాబు ఆయన మెజార్టీ భారీగా తగ్గటంపై ప్రధానంగా పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. కుప్పంలో పార్టీకి పట్టు ఎందుకు తగ్గిందో పార్టీ శ్రేణులతో మాట్లాడి తెలుసుకోనున్నారు. రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం లో పర్యటించనున్న చంద్రబాబు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్నారు.