విచారణ తప్పదా: చంద్రబాబు భవిష్యత్తుపై ఉత్కంఠ?
హైదరాబాద్: కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విచారించక తప్పదనే మాట వినిపిస్తోంది. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్తుపై ఉత్కంఠ చోటు చేసుకుంది. కేసు వల్ల ఆయన చుట్టూ ఉచ్చు బిగిసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పేరును ఎఫ్ఐఐర్లో చేర్చక తప్పదని తెలంగాణ నిఘా విభాగం అధికారి ఒక్కరు అన్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో చంద్రబాబుకు కష్టాలు వచ్చి పడ్డాయి. కేసు సద్దుమణిగినట్లు ఇటీవలి దాకా కనిపించింది.
అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్తో కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు ఆదేశాలతో దర్యాప్తు సంస్థపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు న్యాయపరంగానే ముందుకు వెళుతామని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. కోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనిపై న్యాయ సలహాకూడా తీసుకుంటున్నామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎసిబి ఉన్నతాధికారి ఎకె ఖాన్, ఎజి రామకృష్ణా రెడ్డి గవర్నర్తో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడింది. ఈ నివేదికతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. నిరుడు దాఖలుచేసిన చార్జిషీట్లో 33సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది.
విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29లోపు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము న్యాయస్థానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెప్పారు.
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే నూటికి నూరు శాతం చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి తమకు తెలిపినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారు.
చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఆర్పీసీ ప్రకారం 60 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్కు, దర్యాప్తు సంస్థవద్దకు పిలువడం కుదరదని చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీచేసే అధికారంకూడా ఉంటుందని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి స్పష్టంచేసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం. చంద్రబాబు హైకోర్టుకు వెళ్తే కేసు విచారణ మరో మలుపు తిరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.