చంద్రబాబు చారిత్రక నిర్ణయం - కాంగ్రెస్ తో పొత్తు..!!
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. అందుకోసం బద్ద శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారుతున్నా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో కూడా టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రేసుగుర్రమే..!!
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు..!అందుకు టీడిపి కాంగ్రెస్ పొత్తే నిదర్శనం..!!
తెలంగాణలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, ఏపీలో చర్చలు మాత్రం చాపకింద నీరులా జరుగుతున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందన్న పుకారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కానీ, ఉప్పు-నిప్పులా ఉండే కాంగ్రెస్-టీడీపీ ల మైత్రి బంధం నిజమేనా, ఒక వేళ అయితే, చంద్రబాబు ఏ పరిస్థితుల్లో అందుకు అంగీరించి ఉంటారు? ఆ పొత్తు వెనుక ఉన్న ఎత్తు పల్లాలు ఏంటి అన్న విషయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
టీడిపి కాంగ్రెస్ పొత్తును జీర్ణించుకోలేక పోతున్న తెలుగు తమ్ముళ్లు..!
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోన్న సమయంలో ప్రాంతీయ పార్టీల ఉనికి పెద్దగా లేని రోజుల్లో నందమూరి తారకరామారావు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన ఆ పార్టీకి ఆనాడు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఇబ్బందిపెడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్న వైనం, ఇవన్నీ నచ్చక తెలుగు ప్రజల వాణి వినిపించేందుకు టీడీపీని స్థాపించారు. అటువంటి పరిస్థితుల్లో నాడు కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అని ఉద్బవించిన టీడీపీ, నేడు అదే కాంగ్రెస్ తో పొత్తు అంశంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తానంటున్న చంద్రబాబు..!!
కాంగ్రెస్ తో పొత్తు పుకారు వెలువడగానే చంద్రబాబుపై నెగెటివ్ ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెస్ కు టీడీపీ అమ్ముడు పోయిందని, అన్నగారి ఆత్మ క్షోభిస్తుందని, తెలుగు తమ్ముళ్లు కూడా మదనపడుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఆ పుకార్లు నిజమైతే, తన విశ్వసనీయత పై నిందలు వచ్చినా, తనకున్న ఇమేజ్ ను పణంగా పెట్టి మరీ చంద్రబాబు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఏటికి ఎదురీది మరీ ఎందుకు వెళుతున్నారు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి చంద్రబాబుకు తెలియదా? 40 ఏళ్ల అపార అనుభవమున్న చంద్రబాబు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది.
విభజించిన పార్టీకన్నా.. విభజన హామీలు నెరవేర్చని పార్టీ ప్రమాదం.. అందుకే కాంగ్రెస్ తో పొత్తు..!!
ఇటువంటి ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లతోపాటు సగటు తెలుగు వాడికి రావడం సహజం. ఈ విషయాలపై చంద్రబాబు అంతర్మథనం ఏమిటన్నది నిశితంగా పరిశీలిస్తే, సమాధానం దొరికే అవకాశముంది. ఏపీకి హోదా ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ, నట్టేట ముంచింది. మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం వేరే వారి చేతుల్లోకి వెళితే అభివృద్ధి కుంటుపడుతుంది. ఏపీని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు ప్రజల్లో చంద్రబాబు నిర్ణయంపై వ్యతిరేకత వస్తే, టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకున్న చంద్రబాబు నిర్ణయం సరైనదా? కాదా? అన్నది రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి.