ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష భేటీ పెట్టండి .. కరోనా సంక్షోభంపై జగన్ కు చంద్రబాబు లేఖ
ఏపీలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు అఖిల పక్ష నాయకుల సలహాలు , సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు . ఆన్ లైన్ లో అఖిల పక్ష భేటీ నిర్వహించాలని ఆయన సీఎం జగన్ ను కోరారు. కరోనా తీవ్రతరం అవుతుంటే ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టటం తగదని పేర్కొన్న చంద్రబాబు నిత్యావసరాలను ఇళ్లకే పంపిణీ చెయ్యాలని పేర్కొన్నారు.
రేషన్ కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్న చంద్రబాబు నాలుగున్నర లక్షల మంది విలేజ్ వాలంటీర్లను వినియోగించుకోవాలని సూచించారు . ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదని, ఉద్యానపంటలతో పాటు ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. ఇక కరోనా కట్టడికి నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఇక ఢిల్లీలో జరిగిన మతప్రచార సభకు వెళ్ళిన దాదాపు 700 మంది ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అంశం కలవరపెడుతోందని పేర్కొన్న చంద్రబాబు వారందరినీ తక్షణం గుర్తించాలని పేర్కొన్నారు . వీరందరికీ తక్షణమే కరోనా పరీక్షలు చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించాలని చంద్రబాబు అన్నారు. కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి సాయం అందించేందుకు ప్రతి రాజకీయ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్న చంద్రబాబు ఆన్ లైన్ లో అయినా అఖిల పక్ష భేటీ నిర్వహించాలని సూచించారు.