చంద్రబాబు రాజకీయ జీవితం జుగుప్సాకరం..సుజనా కాల్ డేటా చెప్తుందది : మంత్రి పేర్ని నానీ ఫైర్
ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు నీచమైన రాజనీతిజ్ఞుడు అంటూ నిప్పులు చెరిగారు పేర్ని నాని.
చంద్రబాబు ఆ నేతలకు మొహం చాటేస్తున్నారన్న మంత్రి
ఎన్నికల ముందు మోదీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి వంటి నేతలతో అంటకాగారు అని పేర్కొన్నారు. ఇక అలాంటి చంద్రబాబు ఇప్పుడు వాళ్ల ప్రస్తావన తీసుకు రావడం లేదని మాట్లాడారు పేర్ని నాని. ఎన్నికల్లో ఓటమి తర్వాత వాళ్లలో ఏ ఒక్కర్నీ మళ్లీ కలిసిన పాపానపోలేదని విమర్శించారు. ఇక అంతే కాదు యూటర్న్ లేనని వ్యాఖ్యానించిన నానీ ఒకవేళ నాడు ఎన్నికల ముందు కలిసిన నేతలు ఎయిర్ పోర్టులో కనిపించినా చంద్రబాబు ముఖం తిప్పుకుని వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుది నీచమైన చరిత్ర... బీజేపీతో స్నేహం కోసం మళ్ళీ వెంపర్లాట: మంత్రి పేర్ని నానీ
చంద్రబాబు తన వద్ద ఉన్న దాన్ని పుత్తడి అంటారని, వేరే వారి వద్ద ఉన్న దాన్ని ఇత్తడి అంటారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. చంద్రబాబు రాజకీయ జీవితమంతా జుగుప్సాకరమని, నీచమైన చరిత్ర ఆయనిది అని పేర్ని నాని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మోదీ గారిని వదులుకుని మనం చాలా తప్పు చేశామని వైజాగ్ లో టీడీపీ కార్యకర్తలతో చెప్పటం, అమిత్ షా కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటానికి తండ్రీ కొడుకులు పోటీ పడటం చూస్తుంటే చంద్రబాబు బీజేపీతో సఖ్యం కోసం మరోమారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు.
వైఎస్ఆర్సిపి నేతలు బిజెపికి టచ్ లో ఉన్నారన్న సుజనా చౌదరి వ్యాఖ్యల ఖండన
వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు బిజెపితో సన్నిహితంగా ఉన్నారని పేర్కొంటూ రాజ్యసభ ఎంపి వై సుజనా చౌదరి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు బిజెపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నరన్న సుజనా చౌదరి సమయం చూసి జంప్ అవుతారని పేర్కొన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు, వారు పార్టీని మారతారన్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను అధికార వైయస్ఆర్సిపి ఖండించింది. ఇక ఇదే క్రమంలో మంత్రి పేర్ని నానీ మాట్లాడారు.
ఎంపీ సుజనా చౌదరి కాల్ డేటా బయటపెడితే గుట్టు రట్టు అవుతుందన్న మంత్రి
వైసీపీ ఎంపీలు కాదు బీజేపీకి టచ్ లో ఉంది ఎంపీ సుజనాచౌదరి చంద్రబాబుకు టచ్ లో ఉన్నారని పేర్ని నానీ వ్యాఖ్యానించారు. కాల్ డేటా బయటపెడితే చంద్రబాబు, సుజనా చౌదరిల గుట్టు రట్టవుతుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. సుజనాచౌదరి తెర వెనుక ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందని, ఎవరితో రహస్య ఒప్పందాలు చేసుకున్నారో ఆయన కాల్ డేటా ద్వారా తెలుస్తుందని చెప్పారు . బీజేపీ మేలు కోసం సుజానా ఏనాడైనా ఒక్క ప్రకటన చేశారా అని నిలదీశారు. టీడీపీని ఎందుకు వీడారో సుజనా కారణం చెప్పలేదని, ఆయన దొంగలా వెళ్లి బీజేపీలో చేరారని నాని ఎద్దేవాచేశారు.
దిగజారుడు రాజకీయాలు చెయ్యటంలో బాబు దిట్ట . పవన్ పైన విమర్శలు
ఇక జగన్ చేసే ప్రతి పనికి కులమతాలను అంటగడుతున్నారన్న పేర్ని నానీ హజ్, జెరూసలెం యాత్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనూ సాయం చేశారని, నాడు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాచౌదరి ఇవన్నీ కనిపించలేదా? అని ప్రశ్నించారు. మీ సొంత డబ్బును ప్రజాసంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు ఫీలవుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, ఎంపీ సుజనా చౌదరి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడా పేర్ని నానీ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భవనాలు, శంకుస్థాపన దిమ్మెలకు పసుపు రంగు వేసినప్పుడు.. పవన్నాయుడు కళ్ళు , మెదడు పనిచేయలేదా? అని మరోసారి ప్రశ్నించారు. ఇక చంద్రబాబు చాలా నీచమైన స్వభావం ఉన్నవాడని పేర్ని నానీ విమర్శలు గుప్పించారు.