కేంద్ర వ్యూహాలకు చంద్రబాబు ప్రతివ్యూహాలు..! ఏపీలో హీటెక్కిన రాజకీయం..!
హైదరాబాద్/ ఏపి: ఏపి రాజకీయాలు రసకందాయంలో నడుస్తున్నాయి. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఏకాకిని చేసి రాజకీయంగా దెబ్బకొట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుండగా, ఇటు స్థానికి పార్టీలు కూడా సందుచూసి సన్నాయి వాయించాలని ఉబలాటపడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టి ప్రజాధరణ తగ్గించేందుకు బీజేపి జాతీయ నాయకులే రంగంలోకి దిగారు. ఐతే చంద్రబాబు రాజకీయ చతురత ముందు చతికిలబడిపోతున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు.
ఏపీలో అన్ని పార్టీల లక్ష్య చంద్రబాబే..! రాజకీయ క్రీడలో అంతిమ విజయం ఎవరిదో..!
ఏపీలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల రాజకీయ కదలికలను వేగవంతం చేయడమే కాకుండా టిడిపిని టార్గెట్ చేసుకొని ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే..! ఈనేపధ్యంలో సీఎం చంద్రబాబు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృధ్ధి పధకాలపై ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే దళిత తేజం పేరిట నెల్లూరులో, మైనార్టీలకు దగ్గర కావడానికి నారా హమారా టిడిపి హమారా పేరిట గుంటూరులో భారీ బహిరంగం సభ నిర్వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో నిలబెట్టేందుకు బాబు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
క్షేత్ర స్థాయిలో బాబుకు బలం..! ఎలాగయినా దెబ్బ కొట్టాలని విపక్షాల పన్నాగం..!!
అలాగే వచ్చే నెలలో రాజమండ్రిలో బిసీ మహాగర్జన సభకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు జ్ఞానభేరి పేరిట యువతను ఆకర్షించడానికి విశ్వవిద్యాలయాల వారీగా సభలు నిర్వహించి విద్యాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్యం, నిరుద్యోగ భృతిపై ప్రచారం నిర్వహించాలని టీడీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జన్మభూమి- మావూరు, నీరు-ప్రగతి, నీరు-మీరు, మీఇంటికి మీభూమి, ఇంటింటికీ తెలుగుదేశం పేరిట తెలుగు తమ్ముళ్లకు కార్యక్రమాలను అప్పజెబుతున్నారు టీడిపి ముఖ్యనేతలు.
Recommended Video
బాబును టార్గెట్ చేసిన కేంద్రం..! తిప్పికొడుతున్న పచ్చ దళం..!
దీనికి తోడు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం అమలు చేయకుండా, ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వక పోవడంపై బాబు కేంద్రంపై తిరుగుబావుటా ఎగరవేశారు. ఈ నేపధ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడకట్టి కేంద్రంపై చేస్తున్న ధర్మపోరాటం ఉద్యమంలో బాబు సఫలీకృతులైయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇప్పుడు కేంద్రం ఒకమెట్టు దిగినా, రాష్ట్రంలో బిజేపిపై ప్రజల ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారేలా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి రాష్ట్ర బిజేపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
బాబు చతురత..! ప్రత్యర్థుల కలత..!!
ఈ నేపధ్యంలోనే బిజేపి జాతీయ నేతలు మురళీధర్,రాంమాధవ్,రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావులను రాష్ట్రానికిపంపి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణలను చేయిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు బాబు ప్రజల్లోనికి వెళ్ళి అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంతోపాటు గ్రామదర్శిని, గ్రామవికాస్, నగరదర్శిని, నగరవికాస్ పేరిట ఊరు-వాడ అదికారులతో పాటు, టిడిపి శ్రేణులను పంపి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. మరో పక్క ధర్మపోరాటం పేరిట చంద్రబాబు పెద్దఎత్తున సభలు నిర్వహించి కేంద్రంపై ప్రతిదాడికి దిగుతున్నారు. వీటికి ప్రజలనుంచి టిడిపికి ఆశించిన మద్దతు లభిస్తోందని తెలుస్తోంది. ప్రతిపక్షాల దాడులను ముఖ్యంగా కేంద్ర దూతలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో చంద్రబాబు కేంద్రానికి ఏమేర చెక్ చెప్తారో చూడాలి.