ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు పాపాలు పోవు : మంత్రి వెల్లంపల్లి మండిపాటు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతీది రాజకీయం చేసి, అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు చేసిన పాపాలు పోవని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.
చంద్రం .. మీ కుట్ర విఫలం .. వైఎస్సార్ ఆసరా సఫలం : విజయసాయి ఫైర్
చంద్రబాబు అంతర్వేది రథం దగ్ధం ఘటనను కావాలని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2017 సంవత్సరంలో అక్టోబర్ 19వ తేదీన కే పంటపాడులో రథం దగ్ధం అయిందని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఘటనపై నాడు బీజేపీ, జనసేన నాడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు అంటూ విమర్శించారు. చంద్రబాబునాయుడు కావాలని అంతర్వేది ఘటనను రాజకీయాలు చేస్తూ, మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో టిడిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అంటూ పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో కావాలని అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇక చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలను కూల్చివేస్తే జనసేన బీజేపీ, చంద్రబాబు ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 40 దేవాలయాల్లో కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుది అని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది కాబట్టే ఈ కేసును సిబిఐకి అప్పగించామని వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీని ఎందుకు ప్రశ్నించరని నిలదీసిన వెల్లంపల్లి ప్రభుత్వం చేయలేని తప్పులను కూడా అంటగడుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పనులను ఎవరూ సమర్ధించ కూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.