కాంగ్రెస్తో పొత్తు ఉండదని చంద్రబాబు చెప్పారు...జగన్కు ఓట్లు అడిగే అర్హత లేదు:కేఈ కృష్ణమూర్తి
అమరావతి:వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. గుంటూరు జిల్లా సోమవారం మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి పుల్లారావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో అమరావతి ఐటీ హబ్గా మారుతుందని...ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, మంత్రి లోకేశ్ చొరవే దీనికి కారణమని ప్రస్తుతించారు. రాష్ట్ర విభజన తర్వాత 90 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్లోనే ఉండిపోయాయని...ప్రస్తుతం ఐటీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
ఎక్కడో విదేశాల్లో కంటే మన ప్రాంతంలోనే ఐటీ ఉద్యోగాలు లభిస్తే ఆ సంతృప్తే వేరని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. అసెంబ్లీకి రాని జగన్కు ఓట్లు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచామని వెల్లడించారు.
అమరావతి త్వరలోనే మరో సైబరాబాద్, బెంగళూరు కానుందని మంత్రి పుల్లారావు జోస్యం చెప్పారు. మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, రాష్ట్రానికి ఆయన నాయకత్వం ఎంతైనా అవసరమని మంత్రి పుల్లారావు అన్నారు. అమరావతి, పోలవరం, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రానికి మరో ఐదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు కెఈ కృష్ణమూర్తి, పుల్లారావుతో పాటు ఎంపీలు కొనకళ్ల నారాయణ, గోకరాజు గంగరాజు, ఆప్కో ఛైర్మన్ హనుమంతరావు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐటీ సలహాదారు రవికుమార్, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ తదిదరులు హాజరయ్యారు.