దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పాలన పై విరుచుకుపడ్డారు. టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛ, స్వాతంత్య్రాల తో బ్రతికే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు మాత్రమే కాకుండా జీవించే హక్కును కూడా హరిస్తున్నారని ఆయన ఏపీ ప్రభుత్వంపై ద్వజమెత్తారు.
అమరావతి ల్యాండ్ స్కామ్..చంద్రబాబు, లోకేష్ లకు ఆ దమ్ముందా: మంత్రి అనీల్ సవాల్
రాజకీయ కక్షతోనే అమరావతి భూ కుంభకోణం ఆరోపణలు
రాజకీయ కక్షతోనే అమరావతి భూ కుంభకోణం ఆరోపణలని పేర్కొన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడం కోసమే అమరావతి భూముల పై ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే వైసిపి బరితెగిస్తున్నదని చంద్రబాబు విమర్శించారు. ప్రజల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దు కూడా దాటిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది
వైసిపి దుర్మార్గాలపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు వైసీపీ సర్కార్ ఎన్ని తప్పులు చెయ్యాలో అన్ని తప్పులు చేసిందని అన్నారు.
దుర్మార్గపు పాలనలో మంచి వాళ్ళు పడే కష్టాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఉదాహరణ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమైంది అని చెప్పిన చంద్రబాబు, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షానిదంటూ తెలిపారు. ఇక పార్టీలకతీతంగా పోలీసు వ్యవస్థ పని చేయాలని, ప్రతిపక్షాలను అణచివేయడానికి పోలీసులు పని చెయ్యటం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వానివి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే నిర్ణయాలు
ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో లాక్కునే నిర్ణయాలు తీసుకుంటుందని సిఎన్జి పై పది శాతం పన్నుపెంచి ఆటో డ్రైవర్లపై భారం మోపాలని చంద్రబాబు విమర్శించారు. ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇచ్చి 20,000 లాక్కోవడం హేయమని చంద్రబాబు మండిపడ్డారు.
ధార్మిక సంస్థలు, ఆలయాలపై జరుగుతున్న దాడులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఏ మత విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు అంటూ వ్యాఖ్యానించారు.
Recommended Video
దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేదు
జంగారెడ్డిగూడెం లో నలుగురు యువకులపై దాడిని ఖండిస్తున్నామంటూ పేర్కొన్నారు . దళిత ఆడబిడ్డల మానానికి , ప్రాణానికి కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నామని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కి కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని విమర్శించారు . రేపు ఏపీ మాజీ స్పీకర్ గా పనిచేసిన, టిడిపి నాయకుడు కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కోడెల వర్ధంతిని జరపాలని చంద్రబాబు పేర్కొన్నారు.