చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా: జగన్ దీక్షపై చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్య్కషుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు అనుమతి ఇచ్చేది లేదంటూ చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా అని ఆయన అడిగారు.
విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనలో ఎపికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు కూడా ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన చెప్పారు.
ఎపి రాజధాని కోసం సేకరించిన 50 వేల ఎకరాలను డీనోటిఫై చేయాలని సంబంధిత కేంద్ర మంత్రిని కోరినట్లు, అలాగే తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని భూములను కూడా డీనోటిఫై చేయాలని అడిగినట్లు, అందుకు మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
కార్గో జెట్టీల కోసం ఒక్కోదానికి రూ. 25వేల రూపాయలేసి ఇవ్వడానికి సంబంధిత కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎపిలో విమానయానానికి కెనెక్టివిటి పెంచాలని అడిగినట్లు చెప్పారు. కర్నూలు - అమరావతి రోడ్డును జాతీయ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. పామాయిల్, పట్టు పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని వాణిజ్య మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
కూచిపూడి నృత్యం అభివృద్ధికి రూ. 50 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు. రాజకీయ విభజన అని, ఎపి ప్రజలు కోరుకున్నది కాదని, మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం సాయం చేయాలని ఆయన అన్నారు. గత పదేళ్ల కాంగ్రెసు పాలన పీడ కలగానే మిగిలిందని ఆయన చెప్పారు.
నదుల అనుసంధానాన్ని యుపిఎ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1950 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పోలవరం విషయంలో రెండేళ్లు జాప్యం జరిగిందని అన్నారు. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానాన్ని ఐదు నెలల 20 రోజుల్లో సాకారం చేశామని చెప్పారు కృష్ణా గోదావరుల అనుసంధానం ఓ చరిత్ర అని చెప్పారు.. కృష్ణా, పెన్నా నదుల అనుసందానానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
ఎపిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అమరావతి మ్యూజియానికి కేంద్రం నిధులు ఇస్తానని చెప్పిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పది నెలల పసిబిడ్డ అని, కేంద్రం ఆదుకోవాలని ఆయన అన్నారు. ఇబ్బందులున్నాయని ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదని చెప్పారు.
విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించామని ఆయన చెప్పారు 11 విద్యుత్తు కేంద్రాలకు భూమి కేటాయింపు పూర్తయిందని చెప్పారు. 220 కిలోమీటర్లతో రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా హామీ ఇచ్చారని ఆయన అన్నారు. 16 నెలల్లో ఇన్ని సాధించామని, ఇంకా చేయాల్సింది ఉందని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి చాలా ఇబ్బందులున్నాయని, వాటిని పరిష్కరించుకోవడానికి అందరి సహకారం తీసుకుంటుందని ఆయన చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు తెచ్చి అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
ఎక్కడ కూడా రాజీ పడబోనని అన్నారు. కావాలని తనపై విమర్శలు చేసేవారు పదేళ్లు పాలించారని, వారు ఏం ఉద్ధరించారో చూసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తిన్నదని, రికవరీ చేశానని ఆయన చెప్పారు. భరించలేక, ఓర్వలేక అరాచకంగా ప్రవర్తించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అడుగడుగునా అడ్డు పడుతూ వచ్చారని ఆయన చెప్పారు.
33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన చెప్పారు. రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కోర్టులకు వెళ్లారని, ప్రజలు సహకరించి భూములు ఇచ్చారని చెప్పారు. అభివృద్ధి నిరోధక శక్తులుగా తయారై రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నాటకాలు ఆడాయని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని తాను విదేశీ పర్యటనలు చేస్తున్నానని ఆయన చెప్పారు. తన ప్రయత్నాలు తాను చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నారని ఆయన అన్నారు.
అనుకోని సమస్యలు కూడా రైతాంగానికి వస్తున్నాయని, మంత్రులను పంపించి ఉత్పాదకతను పెంచే పనులు చేపట్టేలా చూస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాను ప్రజలను పట్టించుకుంటానని ఆయన చెప్పారు.