విభజనతో సమస్యలు, కొందరు అడ్డుపడుతున్నారు: చంద్రబాబు
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు వచ్చాయని, ఆ సమస్యలు తట్టుకుని ముందుకు సాగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఉదయం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్బాషా, పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు టిడిపిలో చేరారు.
చంద్రబాబు పార్టీ కండువాకప్పి చాంద్ బాషాను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అనంతపురం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కదిరికి ఔటర్ రింగ్రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, పట్టిసీమను అడ్డుకోవాలని కుట్రపన్నారని, హంద్రీనీవా వల్ల ఉపయోగం లేదని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం భావ్యం కాదన్నారు.
కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసమే టిడిపిలో చేరినట్లు ఎమ్మెల్యే చాంద్బాషా తెలిపారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, కదిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి తనవంతు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుకు అండగా నిలిచేందుకు టిడిపిలో చేరినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్ధసారధి, పలువురు తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.