కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలో తెలుసు, నవ్వుతున్నారా: బాబు, టిట్లీపై పవన్ కళ్యాణ్
అమరావతి: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టాలో తనకు తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
బాలకృష్ణ కంటే ముందే జూ.ఎన్టీఆర్కు నారా బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్, భావోద్వేగం
తాను 28 సార్లు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చానని ఆయన చెప్పారు. 78 సార్లు వర్చువల్ విజిట్ చేశానని తెలిపారు. 53.6 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. గేట్ల పని డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 182 రోజుల్లో లక్షన్నరమంది ప్రాజెక్టును సందర్శించారని చెప్పారు.
పనులను చూసి ఇంజినీర్లు నవ్వుతున్నారని చెప్పడం, విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. పట్టిసీమ కట్టే ముందు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని చెప్పారు. పట్టిసీమ నుంచి 73 టీఎంసీ నీటిని తరలించగలిగామని చెప్పారు. మే నాటికి గ్రావిటీ ద్వారా రైట్, లెఫ్ట్ కెనాల్ నుంచి నీరు వస్తుందని చెప్పారు.కేంద్రం నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో అలా రాబడతామని చెప్పారు.
శ్రీకాకుళం ఘోరంగా దెబ్బతిన్నది: పవన్ కళ్యాణ్
టిట్లీ తుఫాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా ఘోరంగా దెబ్బతిన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరుగా చెప్పారు. పచ్చటి కొబ్బరి చెట్లతో ఉండే ఉద్ధానం ఇప్పుడు బీడు భూమిగా మారిందన్నారు. గోదావరి జిల్లాలకు కోనసీమ ఎలాంటిదో శ్రీకాకుళంకు ఉద్ధానం అలాంటిదని చెప్పారు. ప్రతి ఏటా మూడు పంటలు పండుతాయన్నారు.
టిట్లీ తుఫాను ప్రభావం ఒడిశా పైనే ఉంటుందని తామంతా అనుకున్నామని ఆయన చెప్పారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే టిట్లీ వచ్చిన వెంటనే శ్రీకాకుళం వెళ్లకుండా ఆగిపోయానని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారని, ఇది సరికాదన్నారు.
టిట్లీ విధ్వంసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావాలన్న లక్ష్యంతో తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. టిట్లీ తుఫాను బాధితులకు రైతు రుణమాఫీ చేయాలన్నారు. తుఫాను నేపథ్యంలో జనసేన కవాతు వాయిదా వేద్దామనుకున్నానని, కానీ తుఫాను తీవ్రతపై స్పష్టత రాలేదని చెప్పారు. మామిడి, జీడి, కొబ్బరి తోటలకు హెక్టారుకు రూ.50వేలు, వరికి రూ.40వేలు, పశువులకు రూ.40వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు, చిన్న దుకాణదారులకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్ర బృందాన్ని 15 రోజుల్లో పంపాలని కోరుతున్నామన్నారు.