నన్నే టార్గెట్ చేశారు: బాబు, కిరణ్ రెడ్డితో వాగ్వివాదం
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగింది. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ తననే టార్గెట్ చేశారని కూడా చంద్రబాబు ఈ సమయంలో అన్నారు. తాను ఏం మాట్లాడుతాననే విషయం మీదనే అందరి దృష్టీ ఉందని, తాను సోమవారం శాసనసభలో మాట్లాడుతానని, అన్ని విషయాలూ మాట్లాడుతానని ఆయన అన్నారు.
అందరి మాటలూ తాను వింటున్నానని, తనది సమైక్యమో విభజననో చెప్తానని ఆయన అన్నారు. ఎవరు తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో సోమవారం చెప్తానని ఆయన అన్నారు. అంతా రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాలని, ముఖ్యమంత్రి కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలని, ముఖ్యమంత్రికి తెలియకుండానే కేంద్రానికి బిల్లు రూపకల్పనకు సమాచారం వెళ్లిందా, అలా వెళ్తే అది రాష్ట్రాధికారాలను కేంద్రం కబళించడమేనని ఆయన అన్నారు.
విభజనా, సమైక్యమా అనేది ఇక్కడ సమస్య కాదని, ఫెడరల్ స్ఫూర్తితో పని జరగలేదని, ముఖ్యమంత్రికి తెలియకుండా సమాచారం వెళ్తే అది తప్పు అని ఆయన అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని - కేంద్రం సమాచారం కావానలి అడగిందని, సమాచారం ఇవ్వాలని తాను అధికారులకు సూచించాని, అలా చెప్పడం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి తన విధి అని ఆయన అన్నారు. రాజకీయ వైఖరిలో తేడా ఉన్నప్పటికీ సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రిగా తన విధి అనుకున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి తప్పుల తడకగా అభివర్ణిస్తున్నారని, బిల్లు ఇష్టానుసారంగా పంపించారని, అన్నీ తప్పులే జరుగుతున్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన చేస్తున్నారని ఆయన అన్నారు. విచ్చలవిడిగా చేయడానికి వీలు లేదని, అదే జరుగుతోందని ఆయన అన్నారు. అధికారాలకు పరిధులు కూడా ఉన్నాయని, అందువల్ల రాష్ట్రాధికారాలను కేంద్రం కబళించడానికి వీలు లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని తాను ముందే చెప్పానని, ముఖ్యమంత్రి ఆ విషయం ఇప్పుడు చెబుతున్నారని, అప్పుడే ఎందుకు చెప్పలేదని ఆయన అన్నారు. బిల్లు వచ్చినప్పుడే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఎందుకు తిరిగి వెనక్కి పంపించలేదని ఆయన అడిగారు. రాజ్యాంగాన్ని వక్రీకరించి, ఇష్టానుసారంగా మాట్లాడితే ఆమోదించడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు.
బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు అనారోగ్యం కారణంగా తాను రాలేకోపయానని, బిల్లు వచ్చినప్పుడు అది బిల్లు అనే చెప్పారని, ఆ తర్వాత అది డ్రాఫ్ట్ బిల్లు అంటూ లేఖలు రాశారని, లోపాలు అధ్యయనం చేసిన తర్వాత తాను మాట్లాడుతున్నానని కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగుండి ఉంటే అప్పుడే మాట్లాడి ఉండేవాడినని ఆయన అన్నారు. సమాచారం పంపించాం కాబట్టి విభజనకు అనుకూలమంటే సరి కాదని ఆయన అన్నారు.
ఉల్లంఘనలు జరిగితే వచ్చినప్పుడే బిల్లును వెనక్కి పంపించాలి కాదు, 23 రోజుల తర్వాత ఎలా మాట్లాడుతారని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన బాధ్యతను నిర్వహించలేదని ఆయన అన్నారు. లోపభూయిష్టమైన బిల్లుపై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే బిల్లును వెనక్కి పంపించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని, అయితే కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయుడిగా వ్యవహరించారని ఆయన అన్నారు.