ఆమెకు హైదరాబాదులో వ్యాపారాలున్నాయి, అందుకే...: భువనేశ్వరిపై బాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మీడియా ప్రతినిధులతో ఉల్లాసంగా మాట్లాడారు. వారి నుంచి ప్రశ్నలను ఆహ్వానిస్తూ సమాధానాలు చెబుతూ వచ్చారు. ఎపి ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర విభజన తీరుపై, ఎగువ రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులపై, ఎపి ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే తన వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తావించారు. తన భార్య భువనేశ్వరికి హైదరాబాదులో వ్యాపారాలున్నాయని, అందుకే రాలేదని చెప్పారు. వారాంతాలు ఆమె వస్తుందని చెప్పారు. తాను తన మవనడిని కూడా చూడలేకపోతున్నానని, తాను రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేస్తున్నానని చెప్పారు.
మీరు రాజధాని కరస్పాండెంట్స్ అన్నీ అర్థం చేసుకోవాలని అంటూ ఎక్కడ కొరత ఏర్పడినా మనకే నష్టని అన్నారు. "ఇలాంటి సమావేశాల్లో ఉంటే చర్చ జరుగుతుంది, ఐడియాలు వస్తాయి. నా మైండులో ఏముందో మీకు తెలుస్తుంది" అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఏం ఘన కార్యం జరిగిందని రాష్ట్రావతరణ ఉత్సవాలు జరుపుకుంటామని ఆయన అడిగారు.
ఇటలీ స్వాంత్ర్య దినోత్సవం రోజున సోనియా గాంధీ విభజనను మన నెత్తిన రుద్దారని, అది తలుచుకుంటే ఎంతో బాధేస్తుందని అన్నారు. అందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టామని, కసీ కోపమూ తగ్గడానికి వీల్లేదని, నవ నిర్మాణ దీక్ష అందుకు పురికొల్పుతుందని ఆయన అన్నారు. ఈసారి కూడా నవ నిర్మాణ దీక్ష చేపడుతామని చెప్పారు.
తాను అన్యాయాన్ని సవాల్గా తీసుకున్నానని, భయపడడం లేదని, మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామమని అన్నారు. అంత వరకు ఆందోళనలు చేస్తూ వచ్చిన ఎపి ప్రజలు రాష్ట్ర విభజన బిల్లు లోకసభలో ఆమోదం పొందగానే సైలెంట్ అయిపోయారని, తాను భయపడ్డాడని, అటువంటి సమయంలో సరైన నాయకుడు లేకపోతే తీవ్ర ప్రమాదం సంభవిస్తుందని అన్నారు.
అందుకే పంజాబ్లో ఏం జరిగిందో అది జరుగుతుందని తాను అన్నాన ని, పంజాబ్ స్వర్ణదేవాలయంలో ఏం జరిగిందో అది జరుగుతుందని అంటే తనను తప్పు పట్టారని, వ్యక్తి తీవ్ర నిస్పృహకు గురైనప్పుడు అటువంటి సంఘటనలు జరుగుతాయని, అటువంటి సంఘటనలు జరగడానికి నిమిషం కాలం చాలునని, అటువంటి సందర్భాల్లో ధైర్యం చెప్తే ఆ విధమైన సంఘటనలు జరగవని ఆయన అన్నారు. అందుకే అధైర్యపడవద్దని తాను ఎపి ప్రజలకు చెబుతూ వచ్చానని చంద్రబాబు అన్నారు.