వాజపేయికి నేను సలహాలు ఇచ్చా: చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రశంసలు
హైదరాబాద్: దేశంలో రోడ్ల అభివృద్ధికి నాంది పలికింది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన వాజపేయికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సంతాప తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీ: గొడుగు, రెయిన్ కోట్తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేత ఆగ్రహం
వాజపేయికి టీడీపీ అన్నా, ఎన్టీఆర్ అన్నా ఎనలేని అభిమానం అన్నారు. దేశంలో రహదారి అభివృద్ధికి తనవంతు సలహాలను వాజపేయికి అందించానని చెప్పారు. పార్లమెంటులో వాజపేయి ఎంతో హుందాగా వ్యవహరించారని చెప్పారు.
వైద్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు చాలా బాగా మాట్లాడారని ప్రశంసించారు. అయితే, ఇంత బాగా మాట్లాడుతున్న ఆ నేతలు కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు.
కొన్ని ఆసుపత్రుల భవనాలు సరిగా లేవనే విషయంలో వీరితో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. అన్ని సబ్ సెంటర్లు, స్కూళ్లు, అంగన్వాడీ, పంచాయతీ, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తున్నాని చెప్పారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.