బుద్ధి ఉన్నవారెవరూ జగన్ పార్టీలో చేరరు: చంద్రబాబు
ఏలూరు: బుద్ధిలేనివాళ్లు మాత్రమే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబున నాయుడు వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని , ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, రాష్ట్రాన్ని కారు చీకట్లోకి నెట్టిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పశ్చిగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. అవినీతి, కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
జూన్ రెండు నుంచి రాష్ట్రాలు వేరవుతాయని, ఇక హైదరాబాద్ ఆదాయం సీమాంధ్రకు రాదని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీని గెలిపిస్తే సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తానని, ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లో సాయం అందే విధంగా చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఊరూరా అవినీతి కొండలను తయారు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.