ఏపీకి వస్తానంటే నో చెప్పారు: మోడీకి బాబు షాక్, ఆసక్తికర అంశాలు, కారణాలివీ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ రాకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నో చెప్పారు. ఏపీలో టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు ఆశించిన మేర లేవని ఇప్పటికీ టీడీపీ సమన్వయ కమిటీ రెండుమూడుసార్లు భేటీ అయింది.
Recommended Video
తాజాగా, ఆదివారం బీజేపీ పదాదికారుల భేటీ జరిగింది. ఈ భేటీలోను టీడీపీకి ధీటుగా స్పందించారు. ఇదిలా ఉండగా, టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ తగ్గించేందుకు, అలాగే, ఏపీ ప్రజలకు ఏమిచ్చామో చెప్పేందుకు నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు పూనుకున్నారని తెలుస్తోంది.
ప్రధాని వస్తానంటే వద్దన్న చంద్రబాబు
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చంద్రబాబు కార్యాలయానికి వర్తమానం అందింది. అయితే, పీఎంవో వర్తమానానికి సీఎంవో కార్యాలయం నో చెప్పిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోవడం మంచిదని, అందుకే ప్రధాని కార్యక్రమానికి నో చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని ప్రారంభించేంత పెద్ద కార్యక్రమాలు ఏపీలో లేవని సున్నితంగా చెప్పారని తెలుస్తోంది.
ప్రజల్లో అపోహలు తొలగించేందుకు
కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధుల విషయంలో ఏపీ ప్రజల్లో ఉన్న ఆందోళనలు, అపోహలు తొలగించేందుకు, అలాగే మిత్రపక్షం తెలుగుదేశం పార్టీతో విభేదాల విషయంలో ఓ రకంగా స్పష్టత ఇచ్చేందుకు నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించాలనుకున్నారని తెలుస్తోంది.
మోడీ వస్తే లెక్కలు చెబుతారు
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఏపీకి వస్తే టీడీపీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని చంద్రబాబు భావించారని తెలుస్తోంది. మోడీ వచ్చి ఏపీకి ఇన్ని వేల కోట్లు ఇచ్చామని, ఇన్ని నిధులు ఇచ్చామని చెబుతారు.
మోడీ వ్యాఖ్యలను ఖండించాల్సి వస్తే
అప్పుడు, చంద్రబాబు అదే వేదికపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సభలో ప్రధాని చెప్పడం, దానిని ఖండించే తీవ్ర పరిస్థితులు వస్తే అసలుకే మోసం వస్తుందని, దాని బదులు మోడీ పర్యటన ఉండకపోవడమే బెట్టర్ అని చంద్రబాబు భావించారని తెలుస్తోంది.