కెసిఆర్తో మాట్లాడేది లేదు: తెగేసి చెప్పిన చంద్రబాబు
హైదరాబాద్: సాగు నీటి ప్రాజెక్టులతో తాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మాట్లాడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపేది లేదని ఆయన స్పష్టం చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో త్రైపాక్షిక చర్చలు జరగాలని ఆయన అన్నారు.
కొత్తగా చేపట్టిన సాగు నీటిప్రాజెక్టులపై గానీ, పాత విషయాలపై గానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో గానీ తెలంగాణ ప్రభుత్వంతో గానీ ముఖాముఖి చర్చలు జరపబోమని ఆయన అన్నారు. ఎపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యుసి జోక్యంతో సమస్యలు పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
పరస్పరం చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్రావిర్భావ దినోత్సవ ప్రసంగంలో తనను కెసిఆర్ కోరరడంపై ఆయన ప్రతిస్పందించారు. ఏ విధమైన చర్చలైనా సరే సిడబ్ల్యుసి, ఎపెక్స్ కౌన్సిల్ వంటి సంస్థల సమక్షంలో జరగాలని ఆయన అన్నారు.
నదీజలాల సమస్యలను పరిష్కరించడానికి ఎపెక్స్ కౌన్సిల్, నదీ జలాల బోర్డులు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి ఆదేశించినా ఇటీవల నాగార్జునసాగర్ నుంచి ఎపి వాటా నీటిని విడుదల చేయలేదని ఆయన గుర్తు చేశారు. చాలా ఆలస్యం చేశారని చెప్పారు. ఇరువురం కూర్చుని మాట్లాడుకుంటే అవి పరిష్కారమయ్యేవి కావని అన్నారు.
నాగార్జునసాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అది తనకు ఎంతో బాధ కలిగించిందని, తాను కెసిఆర్కు ఫోన్ చేసి ఇది ఇద్దరికి కూడా సిగ్గుచేటయిన విషయమని చెప్పానని అన్నారు. గవర్నర్ వద్ద కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు.