నేనిప్పుడు చేపలు తింటున్నా, ఉత్పత్తి పెరిగింది, తెలివి వస్తుంది: చంద్రబాబు
నెల్లూరు జిల్లా చెన్నూరులో చంద్రబాబు ఆహారపు అలవాట్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. దాదాపుగా ఆయన వ్యక్తిత్వ వికాస పాఠం చెప్పారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా చెన్నూరు బహిరంగ సభలో మంగళవారంనాడు ఆహారపు అలవాట్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మంచి నడవడిక గురించి దాదాపుగా వ్యక్తిత్వ వికాస పాఠం చెప్పారు. తాను తీసుకునే ఆహారం గురించి వివరించారు. డబ్బులతో తినే ఆహారంతో రోగాలు వస్తాయని ఆయన చెప్పారు.
తాను ఉదయం పూట సజ్జ, రాగి, జొన్న అన్నం తింటానని, కోడిగుడ్డులో పసుపు తీసేసి వైట్ తింటానని, మధ్యాహ్నం ఏదో ఒక పండు మాత్రమే తింటానని, కాఫీ మాత్రం తాగుతానని, ఈ మధ్యనే కాఫీ తాగడం అలవాటు చేసుకున్నానని, మళ్లీ మధ్యాహ్నం రాగి, సజ్జ, జొన్న అన్నం తింటానని చెప్పారు. రాత్రి కూరాగాయలు తింటానని, పడుకునే ముందు పాలు తాగుతానని చెప్పారు. సాయంత్రం సూప్ తీసుకుని డ్రై ఫ్రూట్ తింటానని చెప్పారు.
ఈ మధ్య చేపలు తినడం ప్రారంభించానని, దాంతో చేపల ఉత్పత్తి పెరిగిందని, చేపలు తింటే తెలివి కూడా వస్తుందని, పిల్లలకు చేపలు తినిపిస్తే వారికి తెలివి వస్తుందని, వారి జ్ఞానం పెరుగుతుందని ఆయన చెప్పారు. "నేను తినే ఆహారం మీకు దొరకదా? కానీ మీరు తినరు. మీరు ఆశపడుతారు, దానికి మొదటి విరోధి నాలుక" అని ఆయన అన్నారు.
కొంత మంది తమ్ముళ్లయితే...
కొంత మంది తమ్ముళ్లయితే సాయంత్రం తాగాలని ఆశపడుతారని ఆనయ చెప్పారు. అది ఎంతో ప్రమాదకరమైందని చెప్పారు. వారిని మందు షాపు లాక్కెళ్తుందని, అప్పటి నుంచి సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. పనిలేకపోతే కూడా సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అని ఆంగ్లంలో సామెత ఉందని ఆయన చెప్పారు. లేనిపోని తప్పులు చేసి కొంత మంది జైలుకు వెళ్లారని, కొంత మంది పోతున్నారని ఆయన అన్నారు.
మన ఆహారపు అలవాట్లు మారాలని, మన ఆలోచనా విధానం మారాలని, పాజిటివ్గా ఆలోచిస్తే.. మంచిగా నడుచుకుంటే... నీతీనిజాయితీతో వ్యవహరిస్తే సమస్యలు రావని అన్నారు. అలా లేనివారు తప్పులు చేస్తారు, క్రమశిక్షణ తప్పుతారు, వారి తప్పులే వారికి శాపాలుగా మారి జీవితాలు నాశనమవుతాయని అన్నారు.
మనకు వారసత్వపు జబ్బులు కూడా వస్తాయని, క్యాన్సర్ లాంటి వ్యాధులు అలా వస్తాయని, అందరికీ వస్తాయని కాదు గానీ అలవాట్లు మార్చుకుంటే వాటికి దూరంగా ఉండవచ్చునని అన్నారు.
ఆలోచించి పిచ్చివాళ్లవుతారు..
కొంత మంది సమస్యలు వచ్చాయని ఆలోచించి, ఆలోచించి పిచ్చివాళ్లవుతారని ఆయన అన్నారు. పరీక్షలు తప్పామనో, ప్రేమలో విఫలమయ్యామనో.. తదితర ఆలోచనలు చేస్తే పిచ్చివాళ్లుగా తయారవుతారని, మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నవాళ్లవుతారని చంద్రబాబు అన్నారు.
మంచిని సాధించాలంటే ఏం చేయాలో అదంతా చేస్తున్నామని ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సమీక్షించి మంచిని సాధించే పనులు చేస్తున్నామమని, అందుకే పది సూత్రాలు ఇచ్చానని అన్నారు. ఏ వ్యక్తి కూడా చిన్నగానే పుడుతాడని, గాంధీజి మామూలు కుటుంబం నుంచే వచ్చాడని, గొప్పవాళ్లు కావాలంటే మీలో ఫోకస్ ఉండాలని అన్నారు.