అర్జంటుగా రూ.5వేల కోట్లు పంపండి:అరుణ్జైట్లీకి చంద్రబాబు లేఖ
అమరావతి: రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర నగదు కొరత తీర్చేందుకు గాను ఎపికి తక్షణం రూ.5,000 కోట్ల విలువైన నోట్లు పంపాలని కోరుతూ సిఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీకి లేఖ బుధవారం రాశారు. అలాగే ఈ లేఖ ప్రతులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ప్రాంతీయ అధికారి సుబ్రమణ్యంలకు కూడా పంపారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రుణం, వివిధ వర్గాలకు వితంతు పింఛన్లు, ధాన్యం విక్రయించిన రైతులకు నగదు చెల్లింపుల కోసం కరెన్సీ కొరత కారణంగా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నగదు కొరత కారణంగా సామాన్య ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొంటోందని....జనం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని లేఖలో వివరించినట్లు తెలిసింది. అందువల్ల రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణం 5 వేల కోట్ల రూపాయల విలువైన పెద్ద, చిన్న నోట్లు పంపాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తిచేశారు.