ఆ '39' వీక్, పద్దతి మారకపోతే పొలిటికల్ కెరీర్ ఫినిష్: జలీల్ విందులోను అదే, బాబు సీరియస్..
విజయవాడ: క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకుంటుంటారు. సందర్భమేదైనా.. ఛాన్స్ దొరికిందంటే క్రమశిక్షణపై వారికి క్లాస్ తీసుకుంటారు.
ఇటీవల శాసనసభా పక్ష సమావేశంలోను చంద్రబాబు నేతలకు క్లాస్ తీసుకున్నారట. చెప్పినట్లు నడుచుకోకపోతే పొలిటికల్ కెరీర్ ఉండదని హెచ్చరించారట. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది?.. ఎక్కడ బలహీనంగా ఉంది? వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను హెచ్చరించారట.
ఆ 39నియోజకవర్గాల్లో:
రాష్ర్టంలో 135 నియోజకవర్గాలలో తెలుగుదేశంపార్టీ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు తెలిపారట. అదే సమయంలో మరో 39 నియోజకవర్గాలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పుకొచ్చారట. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు ఇంకా కష్టపడాలని, అవసరమైతే వ్యక్తిగతంగా వారితో మాట్లాడి సలహాలు-సూచనలు ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తాను చెప్పాక కూడా పద్దతి మారకపోతే పొలిటికల్ కెరీర్ క్లోజ్ అవుతుందని హెచ్చరించారట.
జలీల్ ఖాన్ లంచ్:
శాసనసభా సమావేశాల ముగింపు సందర్భంగా శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగింపు అనంతరం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పార్టీ నేతలందరికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం కూడా పాల్గొన్నారు. విందు సమయంలోను చంద్రబాబు క్రమశిక్షణ, పార్టీ బలోపేతం వంటి అంశాల గురించే మాట్లాడేసరికి.. చాలామంది నేతలకు తిన్న తృప్తి కూడా లేకుండా పోయిందట.
ఆలస్యంగా రావడంపై:
అసెంబ్లీ సమావేశాలకు ఆలస్యంగా రావడంపై కూడా చంద్రబాబు నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు విశాఖలో అగ్రిటెక్ సదస్సుకు హాజరైన రోజు.. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు సభకు ఆలస్యంగా వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత మంత్రులు లేకపోవడంతో.. మంత్రి అచ్చెన్నాయుడు సభ నుంచి లాబీల్లోకి పరిగెత్తుకొచ్చి సిబ్బందితో వారికి ఫోన్ చేయించారు. అప్పుడే అటుగా వచ్చిన లోకేష్ విషయం తెలుసుకుని సీరియస్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆ తర్వాత చంద్రబాబుతోను చెప్పారు.
బాబు సీరియస్:
శాసనసభా సమావేశాల ముగింపుకు ముందురోజు కూడా చంద్రబాబు ఆలస్యంగా వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆరోజు ఆలస్యంగా సభకు వచ్చారు. సభ ప్రారంభమయ్యేసరికి కేవలం 51 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు.
అటెండెన్స్ ను ఆన్లైన్ ద్వారా చంద్రబాబుకు పంపించారు. దీంతో మధ్యాహ్నాం 12గం. సమయంలో అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు.. నేతలను తన ఛాంబర్ కు పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. ప్రతిపక్షం లేదు కదా అని ఇంత 'లైట్' తీసుకుంటే కష్టమని మండిపడ్డారట. నిరంతరం పనిచేయడం అలవాటు చేసుకోవాలని ఆయన వారికి సూచించారు. దీంతో గైర్హాజరైన ఎమ్మెల్యేలను అనాల్సింది పోయి.. సభకు వచ్చిన తమకే క్లాస్ తీసుకుంటే ఎలా? అని నేతలు వాపోయినట్లు తెలుస్తోంది.