ఆమోదించాక అధికారిక నివేదిక అంటారా? బీసీ కమిషన్ చైర్మన్పై ఏపీ సీఎం బాబు ఆగ్రహం?
అమరావతి: ఇటీవల కమిషన్ చైర్మన్ అధికారికంగా నివేదిక ఇవ్వక ముందు అందులోని ముగ్గురు సభ్యుల అభిప్రాయాలతో కూడిన నివేదికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులకు బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని, తాము అధికారికంగా నివేదిక సమర్పిస్తామని చెప్పి ఆయన ఆ నెల రెండో తేదీన బెంగళూరు వెళ్లిపోయారు. తాను రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని, దాన్ని బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ ప్రభుత్వానికి అందజేస్తారని కూడా చెప్పారు.
అయితే అధికారిక నివేదిక అంటే తమ ప్రభుత్వానికి మచ్చ వస్తుందని సీఎం చంద్రబాబు భావించారని సమాచారం. దీంతో ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శిగా కూడా ఉన్నకృష్ణమోహన్ సెలవుపై వెళ్లడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబే బలవంతంగా సెలవుపై వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.
సెలవులో ఉన్నానని పేర్కొన్న చైర్మన్ మంజునాథ
అంతకుముందు మరోపక్క అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉన్నందున నివేదికను వెంటనే ఇవ్వాలని కమిషన్ చైర్మన్ మంజునాథను సీఎం చంద్రబాబు కోరారు. తాను సెలవులో ఉన్నానని, వచ్చిన తరువాత ఇస్తానని జస్టిస్ మంజునాథ్ చెప్పినా సీఎం వినిపించుకోకుండా ముగ్గురు సభ్యుల ద్వారా ఆ నివేదికను తెప్పించుకున్నారని సమాచారం. ఇటు ప్రభుత్వం, అటు కమిషన్ సభ్యులు తనకు విలువ ఇవ్వకపోవడం కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. నిబంధనలు తెలిసీ ఈ విధంగా ఎందుకు చేశారని సభ్యులను జస్టిస్ మంజునాథ్ ప్రశ్నించినట్లు సమాచారం.
కమిషన్ సభ్యులపై దొంగతనం కేసు పెట్టేందుకు మంజునాథ?
బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ ఇచ్చే అధికారిక నివేదికపై మళ్లీ చర్చ జరగకుండా ఉండటానికి ప్రభుత్వ అధికారి కృష్ణ మోహన్ను సెలవుపై వెళ్లాలని ఆయన ఆదేశించారు. కాగా, తనకు తెలియకుండా నివేదికను ప్రభుత్వం తీసుకోవడంపైనా, దానికి కమిషన్ సభ్యులు సహకరించడంపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నసంగతి తెలిసిందే. తన పేరుపై ఏర్పాటైన కమిటీ నివేదిక తనకే తెలియకుండా ప్రభుత్వానికి చేరడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ తీర్మానం చేయకుండానే నివేదికను కార్యాలయం నుంచి బయటకు తీసుకెళ్లిన సభ్యులపై దొంగతనం కేసుపెట్టే యోచనలో కూడా చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల నాలుగో తేదీన కమిషన్ తరఫున సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తారని జస్టిస్ మంజునాథ్ ఈనెల రెండో తేదీన మీడియాకు తెలిపారు. అయితే నాలుగవ తేదీ నుంచి కృష్ణ మోహన్ సెలవుపై ఉండటం గమనార్హం.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్పై బిల్లు ఆమోదం
పోలవరం టెండర్లకు కేంద్రం బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రజల్లో మొదలైన చర్చను దారి మళ్లించేందుకు ప్రభుత్వం హడావుడిగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఈనెల ఒకటో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీ కమిషన్ నివేదికపై చర్చించి ఆమోదించారు. అనంతరం అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశ పెట్టిన రోజే కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని స్పష్టం చేశారు. తాము అధికారిక నివేదిక ఇస్తామన్నారు.
సీఎం సూచన మేరకే సెలవులో సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ ?
చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించేశాక మరోసారి నివేదిక అందించడం ఏమిటని కమిషన్ సభ్య కార్యదర్శి సెక్రటరీ కృష్ణమోహన్ వద్ద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ నిర్ణయమని కృష్ణమోహన్ చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారిక నివేదిక అనే ప్రసక్తి రాకుండా ఉండటానికి కృష్ణమోహన్ను సెలవులో వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. నివేదిక సమర్పించడానికి కమిషన్ సభ్య కార్యదర్శి సెలవులో ఉన్నారని.. ఆయన ఆదివారం నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా మాట్లాడలేకపోతున్నానని సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ లీవ్లెటర్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనను సంప్రదించేందుకు మీడియా యత్నించగా అందుబాటులోకి రాలేదు.