ఏమిటీ రాక్షస పాలన .. వైసీపీకి ఓటెయ్యకుంటే ఇల్లు కూల్చేస్తారా .. వైసీపీ పాలనపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో వైసిపి సర్కార్ పరిపాలన తీరుపై మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది . అప్పటి నుండి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు .వైసీపీ శ్రేణుల దాడులకు భయపడి ఊళ్ళు వదిలి వెళ్ళాలా అని ప్రశ్నించిన బాబు తాజాగా ఏమిటీ రాక్షస పాలన అని మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్తల ఇల్లు కూల్చివేతపై మండిపడిన బాబు .. ఇదేనా పాలన అని ప్రశ్న
ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని చెప్పిన చంద్రబాబు నెల్లూరుజిల్లా వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా కార్యకర్తల ఇళ్ళు కూలుస్తున్నారు. కేవలం వైకాపాకి ఓటు వేయలేదన్న కారణంతో తెదేపా సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకోవడం గర్హనీయం. ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటూ ట్వీట్ చేశారు . అప్రజాస్వామిక చర్యలు ఇకనైనా ఆపాలని హితవు పలికిన చంద్రబాబు ఈ దాడులు హేయమని పేర్కొన్నారు. ఇళ్ళ కూల్చివేతలు, దాడులు తప్ప ప్రభుత్వం ఏమీ చెయ్యటం లేదంటూ పాలనను గాలికి వదిలేసింది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు వేధిస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన బాబు
ఇక అంతే కాదు పించన్ అడిగిన టీడీపీ సానుభూతిపరులపై దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా నానా అవస్థలకు గురి చేస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ కోసం పని చేసిన వారిపై దాడులకు దిగుతున్నారు అంటూ ఇది పద్ధతి కాదని ఆయన పదేపదే వార్నింగ్ ఇస్తున్నారు.ఇక మరో పోస్ట్ లో ఏమిటీ రాక్షస పాలన? చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న మహిళలను ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ఘటనలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తెదేపా చూస్తూ ఊరుకోదు అని పేర్కొన్న చంద్రబాబు జగన్ సర్కార్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఒకపక్క టీడీపీ శ్రేణులకు అండగా ఉంటామని చెప్తున్నా రోజు రోజుకీ పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు .
చంద్రబాబు కంఠ శోష తప్ప వైసీపీ పట్టించుకున్న దాఖలాలు లేవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఇంకా గ్రామాల్లో పరిస్థితులు మాత్రం ఎన్నికల ముందు యుద్ధ వాతావరణాన్నే తలపిస్తున్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు . చిలికి చిలికి గాలి వానలా దాడులు శృతి మించుతున్నా , ప్రతిపక్ష పార్టీలు దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక చంద్రబాబు ఎంతగా మండిపడినా , ఆగ్రహం వ్యక్తం చేసినా వైసీపీ సర్కార్ అవేవీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.