చంద్రబాబు షాకింగ్ కామెంట్ .. అమరావతికే కాదు ఇక ఏ ప్రాజెక్ట్ కు నిధులు రావట
Recommended Video
ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రూపాయల రుణం ఇవ్వలేమని ప్రపంచ బ్యాంకు తన వెబ్ సైట్ లో ప్రకటించింది . ఈ నేపథ్యంలో, చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రపంచబ్యాంకు రుణాన్ని తిరస్కరించిందంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అయితే వైసీపీ వల్లే ఇది జరిగిందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తుంది.
చంద్రబాబు వల్లే ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వకుండా వెనక్కు పోయిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి వైసీపీ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కావాలని రైతుల చేత ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క అమరావతికే కాదు, ఇక నుండి రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు ఇకపై నిధులు రావని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రమంతా పులివెందుల తరహా గొడవలు కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని ఆయన పేర్కొన్నారు.
ఇసుక దొరక్క, దాని రేటు రెండింతలు పెరిగిపోయిందని పేర్కొన్న చంద్రబాబు దీంతో నిర్మాణరంగం కుదేలై, నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాజధాని పరిధిలో సుమారు రూ.2లక్షల కోట్ల విలువైన భూమి ఉందని చంద్రబాబు తెలిపారు . గతంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని, ఇప్పుడు షేర్ మార్కెట్ తరహాలో అంతా కుదేలైందని చెప్పారు. రాజధాని పరిధిలో వ్యవస్థ అంతా కుదేలవుతుందని, కూలీలకు పని దొరకడం లేదన్న చంద్రబాబు రాజధాని నిర్మాణం కూడా చెయ్యలేని దుస్థితికి , ఇక తాజాగా ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వకపోవటానికి వైసీపీ కారణం అని తేల్చి చెప్తున్నారు.