'మోడీతో బాబు అమీతుమీ తేల్చుకోవాలి': వీహెచ్పై కామినేని ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి సోమవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పైన చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.
పది నెలల చంద్రబాబు పాలనలో ఎనిమిది నెలలు విదేశాల్లోనే తిరిగారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
విహెచ్పై కామినేని ఆగ్రహం
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు పైన ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు మండిపడ్డారు. వీహెచ్ నక్షత్రకుడు లాంటివారని, వీహెచ్ వల్లే రాష్ట్రం విడిపోయిందని దుయ్యబట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని పదవులు సంపాదిస్తారన్నారు. వీహెచ్ వల్ల రాష్ట్రానికి ఏ పనీ కాదన్నారు.
నిధుల్లో కోత: రేవంత్ రెడ్డి
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. అధికారం కోసం తెరాస నేతలు కొట్టుకునే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.