చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలి...ఎంపి టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు:కర్నూలు టీడీపీలో మళ్లీ ఎమ్మెల్యే టికెట్ రాజకీయం రాజుకుంది. టిడిపి రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని టీజీ భరత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తే కర్నూలు జిల్లాలోని 14 సీట్లు టీడీపీ సొంతం అవుతాయని భరత్ చెప్పారు. అయితే చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయలేని పక్షంలో ఈ నియోజకవర్గంపై సర్వే చేయించి ఆ ప్రకారం గెలిచే వారికే కర్నూలు సీటు కేటాయించాలని ఆయన కోరారు.
ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో ఎంపి టిజి వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కర్నూలు ఎమ్మెల్యే సీటును తన కుమారుడు టిజి భరత్ కు ఇప్పించాలని ఎంపి వెంకటేష్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గం పరిథిలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్న టిజి వెంకటేష్ కు మంత్రి నారా లోకేష్ ప్రకటన మింగుడు పడలేదు.
దీనిపై టిజి వెంకటేష్ అప్పుడే తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు పలు సందర్భాల్లో తన అసహనాన్ని వ్యక్తీకరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, వైసిపి నుంచి ఫిరాయించి టిడిపిలోకి రాగా...అలా అప్పటి నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ల మధ్య అసెంబ్లీ సీటు పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపి టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ వ్యాఖ్యలతో మళ్లీ ఈ సీటు వివాదం తెరపైకి వచ్చినట్లయింది.
దీంతో కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయమై టిడిపి అధిష్టానం ఏదో ఒక రకంగా టిజి వెంకటేష్ కు ఆయన కుమారుడుకు నచ్చచెప్పనట్లయితే ఈ వివాదం అంతకంతకూ రాజుకొని కర్నూలు జిల్లాలో తెలుగు దేశం పార్టీకి నష్టదాయకంగా పరిణమించే అవకాశాలను కొట్టిపడేయలేమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.