జగన్పై అక్రమాస్తుల కేసులే ఉన్నాయి, ఆ ఆస్తులు మాత్రం బాబు వద్దే: రోజా విమర్శలు
చిత్తూరు: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బాబును మెంటల్ ఆస్పత్రిలో చేర్పించి..
ఏపీ సీఎం చంద్రబాబును వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వేయి కాళ్ల మండపాన్ని టీటీడీ పునఃనిర్మించాలని ఈఓకు వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. టీటీడీని ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
యూటర్న్ తీసుకోలేదా?
ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా? అని రోజా ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు.
మోడీ పాదాల వద్ద తాకట్టు
వైయస్సార్సీపీ ఎంపీల రాజీనామా తర్వాత బాబు యూటర్న్ తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసం రాష్ట్ర భవిష్యత్ను మోడీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసు మాత్రమే వైయస్ జగన్పై ఉందని, అక్రమాస్తులు చంద్రబాబు దగ్గరే ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ ఇంట్లోకి ఎవరికి అనుమతిలేదా?
దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆస్తులు ఎందుకు మోడీ జప్తు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు. రూ.250 కోట్లతో హైదరాబాద్లో రహస్యంగా ఇల్లు కడితే ఆ ఇంట్లోకి ఒక్క టీడీపీ నాయకుడిని కూడా ఎందుకు ఆహ్వానించలేదో సమాధానం చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో నిర్మించారు కాబట్టే ఎవరినీ ఆహ్వానించలేదని ఆరోపించారు. అధికారంలో వచ్చావు.. రాయలసీమ ప్రజలకు కరువు తెచ్చావని చంద్రబాబునుద్దేశించి రోజా ఎద్దేవా చేశారు.