బాబు బాటలో వైసీపీ సోషల్ మీడియా ఉద్యమం .. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ... ట్వీట్స్ వైరల్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నిరసనల సెగ తగులుతోంది. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, వైయస్సార్సీపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. #GetwellsoonCBN అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా పెడుతున్న హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీ
రాజధాని విషయంలో రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బాబు సవాల్
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకొని దాని అమలు కోసం ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా గవర్నర్ ఆమోదంతో విడుదలైన గెజిట్ తో మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుందని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, లేదంటే మూడు రాజధానుల పేరుతో వైసిపి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల ఆమోదం పొంది తిరిగి రావాలని, ప్రజల మద్దతు వైసీపీ నేతలకు లభిస్తే అప్పుడు తాము సైలెంట్ గా ఉంటామని చంద్రబాబు సవాల్ విసిరారు.
చంద్రబాబు త్వరగా కోలుకోవాలని వైసిపి రివర్స్ ఎటాక్
చంద్రబాబు విసిరిన సవాల్ కు సమాధానంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ నేతలు.అంతేకాదు చంద్రబాబుకు మతిభ్రమించింది అని ఆయన మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ట్వీట్స్ చేస్తున్న వైసిపి నాయకులు సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది : హోంమంత్రి సుచరిత
ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఏపీ ప్రజలు మూడు రాజధానులు స్వాగతిస్తున్నారని చంద్రబాబు యొక్క వితండవాదం మరియు కుల, మతోన్మాదం పట్ల జాగ్రత్త వహించండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇది మనం జాగ్రత్తగా ఉండాల్సిన మరో అంటువ్యాధి గత ఎన్నికలలో ఇది నయమై వుండాలి కానీ కొన్ని అరుదైన సందర్భాలలో అదనపు సమయం పట్టేలా ఉంది అంటూ ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబునాయుడుకు మంచి ఆరోగ్యం మరియు మంచి ఆలోచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ #getwellsoonCBN హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు హోంమంత్రి సుచరిత.
ప్రజలందరికీ అర్థం అయినా నీకు అర్థం కాదా బాబు : మంత్రి బాలినేని
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మన శక్తినంతా ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయడానికే వినియోగించడం సబబు కాదని, మిగతా రాష్ట్రాన్ని విస్మరించడం ఒక అపరాధమని తెలుసుకున్నారు. ఇక మీరు ఎప్పుడు తెలుసుకుంటారు చంద్రబాబు అంటూ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. #getwellsoonCBN హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు . ఏపీ ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించ వలసింది చంద్రబాబు నుండే : రోజా
చంద్రబాబును టార్గెట్ చేస్తూ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి కూడా ట్వీట్ చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆమె తన ట్విట్టర్లో ఎకౌంట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించాల్సిన అవసరం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు నుండే ఆయన హానికరమైన ఆలోచనల నుండే అంటూ రోజా తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబు యొక్క ఈ ధోరణి వల్లే 2019 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ ని విసిరి పారేశారు అంటూ పేర్కొన్న రోజా #getwellsoonCBN హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Recommended Video
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ ఇవే
సోషల్ మీడియాలో ప్రస్తుతం #getwellsoonCBN, #APWelcomes3Capitals హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసిపి కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం మోత మోగుతున్న ఈ ట్వీట్లు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.