జగన్ను ట్రంప్ పిలవనిది అందుకే.. ఎంక్వైరీలతో నన్నేమీ చేయలేరు.. చంద్రబాబు ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటుచేసిన విందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్ కు మాత్రమే పిలుపురావడం, ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఘాటు కామెంట్లు చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో రెండ్రోజులు పర్యటించిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐ కుంభకోణం, ఐదేళ్ల టీడీపీ పాలనపై సిట్ ఏర్పాటు అంశాలపైనా చంద్రబాబు స్పందించారు.
Recommended Video
అందకే పిలవలేదు..
జగన్ సీఎం అయిన తర్వాత పీపీఏలను అడ్డగోలుగా రద్దు చేసిన సందర్భంలో వివిధ దేశాల రాయబారులు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదని, వైసీపీ నేతల బెదిరింపులతో విదేశీ కంపెనీలన్నీ ఏపీ నుంచి పారిపోతున్నాయన్న చంద్రబాబు.. జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టే ట్రంప్ తో విందు భేటీ ఆహ్వానం అందలేదని తెలిపారు.
ఎంక్వైరీతో జరిగేదిదే..
టీడీపీ ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని ఎంక్వైరీలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నిర్ధిష్టమైన ఆరోపణలపై కాకుండా, అడ్డగోలుగా ఏర్పాటైన సిట్ చివరికి ప్రభుత్వం చెప్పిన రిపోర్టునే సమర్పించాల్సివస్తుందితప్ప నిజంగా ఎలాంటి తప్పులు జరగలేదని ఆయన చెప్పారు.
విజిలెన్స్లో లేని పేర్లతో..
జగన్ సీఎం అయిన తర్వాత ఈఎస్ఐ వ్యవహారంపై విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్నారని, ఆ నివేదికలో అచ్చెన్నాయుడితోపాటు టీడీపీ మంత్రుల పేర్లు లేవని, ఇప్పుడేమో కేవలం బుదరజల్లడానికే స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. జగన్ సీఎంలా కాకుండా సైతానులా వ్యవహరిస్తున్నారని, ఆయనను చూసి పెట్టుబడిదారులంతా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అడ్డపంచెల బ్యాచ్..
ప్రజారాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించే అధికారం ఎవరికీ లేదని, రాజధానిని మార్చాలని చూస్తే చరిత్రలో హీనులుగా మిగిలిపోకతప్పదని చంద్రబాబు విమర్శించారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నంలో ఇప్పుడు పులివెందుల అడ్డపంచెల బ్యాచ్ తిష్టవేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.