జగన్ పాలనపై జాతీయ మీడియా ప్రతికూల కథనాలు: చంద్రబాబు, పవన్కు అస్త్రాలుగా
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత పాలన గాడి తప్పిందంటూ జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను అస్త్రంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మలుచుకున్నారు. పాలన నిరాశాజనకంగా ఉందంటూ కథనం రాసుకొచ్చింది ఆ పత్రిక. ఇదే కథనంను ట్విటర్లో పోస్టు చేశారు చంద్రబాబు.
టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చిన జాతీయ మీడియా కథనాలు
తెలుగు జాతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కలల రాజధాని నిర్మాణంను జగన్ అడ్డుకుంటున్నారని ఎప్పటినుంచో టీడీపీ ధ్వజమెత్తుతోంది. ఇక టీడీపీ ఆరోపణలకు ఊతమిస్తూ జాతీయ దినపత్రిక జగన్ పాలన నిరాశజనకంగా ఉందంటూ కథనం రాసుకొచ్చింది. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.
ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా..
ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు ఐదునెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న ముఖ్యమంత్రిగా సీఎం జగన్ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇందుకు నిదర్శనం ఈ పత్రికా కథనాలే అని ట్వీట్ చేశారు చంద్రబాబు. తనపై కక్షతో తాను నిర్మించిన వాటిని కూల్చడం మాని ప్రజలకు మంచి ఏంచేయాలో సీఎం జగన్ ఆలోచించాలని సలహా ఇచ్చారు చంద్రబాబు.
సీఆర్డీఏ సింగపూర్ల మధ్య ఒప్పందం రద్దు
ఇక కథనం విషయానికొస్తే యంగ్ చీఫ్ మినిస్టర్లలో ఒకరుగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన నిరాశాజనకంగా ఉందని కథనాలు రాసుకొచ్చింది జాతీయమీడియా. గత ప్రభుత్వంలో అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ)తో సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో 6.84 కిలోమీటర్ల మేరా గ్రీన్ఫీల్డ్ స్టార్టప్ ఒప్పందం చేసుకోగా దాన్ని రద్దు చేసింది జగన్ సర్కార్. ఒకవేళ అది పూర్తయ్యింటే ప్రత్యక్షంగా పరోక్షంగా 50వేల ఉద్యోగాలు వచ్చేవని జాతీయ పత్రిక అభిప్రాయపడింది. అంతేకాదు చంద్రబాబు మార్క్ను తుడిచివేయాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని జాతీయ మీడియా కథనం రాసుకొచ్చింది.
పెద్ద ఎత్తున్న పనులు నిలిచిపోయాయన్న జాతీయ పత్రిక
ఇప్పటికే చాలా చోట్లు పనులు నిలిచిపోయాయని రాసుకొచ్చిన ఆ జాతీయ పత్రిక.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నిలిచిపోయాయని, అదే సమయంలో రుణాలు ఇచ్చే వరల్డ్ బ్యాంక్, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కూడా వెనక్కు తగ్గాయని కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఏపీలో తాజా పెట్టుబడులు వచ్చేలా కనిపించడంలేదని జాతీయ పత్రిక తన కథనంలో రాసింది.
జాతీయ పత్రిక రాసిన కథనంను పోస్టు చేసిన పవన్
ఇసుక విషయం నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుల వరకు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఢిల్లీలో జగన్పై అభిప్రాయం ఇదీ అంటూ మరో జాతీయ పత్రికలో వచ్చిన కార్టూన్ కటింగ్ను ట్విటర్లో పోస్టు చేశారు. అంతేకాదు ఆ పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే మరో జాతీయ దినపత్రిక తన ఎడిటోరియల్లో రాసిన కథనాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పరిపక్వత లేని రాజకీయాలను ఏపీ సీఎం జగన్ చేస్తున్నారని తన పోస్టులో కళ్యాణ్ రాసుకొచ్చారు. తిరోగమన రాజకీయాలు అనే శీర్షికతో ఆ పత్రిక కథనం రాసుకొచ్చింది. ముఖ్యంగా అమరావతితో సింగపూర్ ఒప్పందం రద్దు చేయడం రాజకీయంలో భాగమే అని రాసుకొచ్చింది.