‘కియా’లో ఏం జరుగుతోంది? ఛేజ్ చేసిమరీ రామకృష్ణ అరెస్టా?: చంద్రబాబు మండిపాటు
అనంతపురం జిల్లాలోని కియా మోటార్ కార్ల పరిశ్రమ పక్కరాష్ట్రం తమిళనాడుకు తరలిపోతోందన్న వార్తల నేపథ్యంలో అసలా ఫ్యాక్టరీలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. కియా మోటార్స్ ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేత రామకృష్ణను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
''కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారును పోలీసులు వెంబడించి మరీ ఆయనను అరెస్టు చేయడం ఏమిటి? ఆయనేమైనా నేరస్తుడా? అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహనిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే''అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అనంతపురం జిల్లాలోని కియా మోటార్ కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందని ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థల్లో వార్లు రావడం, ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైసీపీ నేతలు ఇది నిజం కాదని చెప్పించడం తర్వాతి రోజే తాము రాసింది నిజమేనని సదరు మీడియా సంస్థలు చెప్పడం... ఈ పరిణామాలన్నీ తీవ్ర అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
కియా సంస్థ తరలింపు వార్తల్లో వాస్తవాలేమిటో, అసలు తెరవెనుక జరిగిందేమిటో, కియా సంస్థ ప్రతినిధుల్ని బెదిరించింది ఎవరో అసలు దానిపై వస్తోన్న వార్తల్లో నిజానిజాలేమిటో ప్రజలకు తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోడానికి వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారంటే.. లోపలేదో రహస్యాన్ని ప్రభుత్వం దాస్తున్నట్లుగా అనిపిస్తున్నదని టీడీపీ చీప్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చెశారు.