హైదరాబాద్ను చూస్తే నాకో తృప్తి: బాబు, విభజనపై..
అమరావతి: ఏపీని నెంబర్ వన్ చేస్తామని, సింగపూర్ లాంటి రాజధాని ప్రపంచంలో మరొకటి ఉందంటే అది అమరావతి కావాలని, అందుకోసం అందరం కృషి చేయాలని, రాజధాని నిర్మాణంలో తానే మొదటి కూలిని అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎల్లుండి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని, ఈ నేపథ్యంలో నాడు సంకల్ప దీక్ష చేపడతామని, దానికి రాష్ట్ర ప్రజలు అందరు రావాలని, మీరు లేకుంటే నేను లేనని చెప్పారు.
భవిష్యత్తులో బ్రహ్మాండమైన రాజధాని రావాలని నాలుగో తరగతి చిన్నారి సహా ముగ్గురు స్కేటింగ్ చేస్తూ సాహసం చేసి భూమిపూజకు వచ్చారన్నారు. ఆమె తాను గల్లాలో దాచుకున్న డబ్బులు కూడా రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చిందని చెప్పారు.
ఈ సందర్భంగా పాప మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని సింగపూర్లా మార్చాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదని తాను చాలాసార్లు చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజన చేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన అన్నారు.
రాజధాని నిర్మాణం ఒక సంక్షోభమే కాకుండా, మనకు ఓ మంచి అవకాశమన్నారు. సంక్షోభం వచ్చిందని కుంగిపోవద్దన్నారు. హైదరాబాదును చూస్తే తనకు తృప్తి కలుగుతుందన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, సైబర్ సిటీ తదితరాలను చూస్తే.. నేనే కట్టానని తృప్తి తనకు ఉంటుందన్నారు.
రాజధాని నిర్మాణం ఎవరికీ రాదని, అది ఇప్పుడు మనకు వచ్చిన అవకాశమన్నారు. హైదరాబాదులో నిర్మాణాలు కట్టే అవకాశం తనకు వచ్చిందని, కానీ ఇప్పుడు ఏకంగా రాజధాని కట్టే అవకాశం వచ్చిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తామన్నారు.
తెలుగు ప్రజలకు ఓ రాష్ట్రం కావాలని నాడు పొట్టి శ్రీరాములు పోరాటం చేసి సాధించారన్నారు. నాడు నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణ నేపథ్యంలో.. తెలుగు జాతిని కలిపేందుకు పెద్దలు ముందుకు వచ్చారని, అందుకే 1956లో ఏపీ ఏర్పడిందన్నారు.
తెలంగాణ ప్రజల కోరిక మేరకు విభజన జరిగినప్పటికీ విభజనలో హేతుబద్ధత లేదన్నారు. విజయ దశమి నాడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతుందన్నారు. రాజధాని నిర్మించుకునే అవకాశం 5 కోట్ల తెలుగు ప్రజలకు వచ్చిందన్నారు. సోమవారం తుళ్లూరులో మహా సంకల్పం ఉంటుందన్నారు.
హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతికి తాను, స్వర్గీయ ఎన్టీఆర్ కారణమని తెలిపారు. ఏపీ రాజధానికి.. దేవతలకు రాజధాని అయిన అమరావతి పేరును పెట్టామన్నారు. ప్రపంచంలో నాకు మంచి పేరు ఉందని, నా పేరు, వ్యక్తిత్వం వల్ల సింగపూర్, అమెరికా వంటి దేశాలు ముందుకు వస్తాయన్నారు.
సింగపూర్ లాంటి రాజధానిని కట్టుకుంటామని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు, తదితరాలను సవాల్గా తీసుకొని పని చేస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణంలో మొదటి కూలీగా నేను పని చేస్తానని చెప్పారు. నాలుగో తరగతి పాప తిరుపతి నుండి స్టేటింగ్ చేసుకుంటూ వచ్చిందన్నారు.
అందరి సహకారం కావాలన్నారు. సింగపూర్ లాంటి రాజధాని ప్రపంచంలో ఏదంటే అమరావతి పేరు చెప్పేలా నిర్మిస్తామన్నారు.
విపక్షాలు రాజధాని నిర్మాణంపై విమర్శలు చేస్తున్నారని, వాటిపై తాను ఎల్లుండి మాట్లాడుతానని చెప్పారు. రాజధాని వల్ల పలువురు కోటీశ్వరులయ్యారన్నారు. ప్రపంచంలో ప్రతి దేశంలో తెలుగు వాళ్లు ఉండేందుకు నేనే కారణమని చెప్పారు.