వనజాక్షికి చంద్రబాబు ఫోన్: మాట్లాడ్తానని హామీ, కల్పన ఫైర్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్న కృష్మా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆయన ఆమెకు ఫోన్ చేసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తహశీల్దార్ వనజాక్షితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై పూర్తి వివరాలు తెప్పించుకుంటానన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా, రాగానే అన్ని విషయాలు మాట్లాడుతానని తహశీల్దార్కు చెప్పారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తానన్నారు. ఉద్యోగుల భద్రతకు తాను హామీ ఇస్తున్నానని వనజాక్షితో చంద్రబాబు చెప్పారు.
వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను చంద్రబాబు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ టిడిపి నాయకుడు వల్లభనేని వంశీకి అప్పగించారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ఘటనపై తీవ్రంగా స్పందించారు.
వనజాక్షిపై దాడి కేసును నీరు గార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చింతమనేని ప్రభాకర్ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపింాచరు .
వనజాక్షిపై దాడికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వారి ధర్నాకు వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నాకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులతో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చర్చలను ప్రారంభిచారు. చింతమనేని ప్రభాకర్ను, ఆయన గన్మన్ను అరెస్టు చేయాల్సిందేనని రెవెన్యూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.