వెనక్కి ఎందుకో జగనే చెప్పాలి: బాబు, హోదాపై సిఎం ప్రకటనని అడ్డుకున్న వైసిపి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశ పెట్టే ముందు.. సోమవారం సభలో ప్రకటన చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం తాము హోదాను కోరుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
చంద్రబాబు ప్రకటనను వైసిపి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదా పైన తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని అన్ని పార్టీలు భావించిన నేపథ్యంలో తీర్మానం పంపించేందుకు ముందు.. చంద్రబాబు ప్రకటన చేస్తున్నారు. ఈ సమయంలో గందరగోళం చెలరేగింది.
చంద్రబాబు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు మనం శాసన సభ ద్వారా ఓ భరోసా ఇద్దామన్నారు.
రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదన్నారు. ఈ రాష్ట్ర హక్కులను కాపాడటంలో, ఈ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో అందరి కంటే ముందు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. భావి తరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాను కోరుతున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాష్ట్ర కోసం టిడిపి పోరాడుతుందన్నారు.
సభలో మనం ముఖ్యంగా 3 చర్చించుకోవాలన్నారు. విభజనకు ముందు తతంగం, విభజన తర్వాత పరిణామాలు, భవిష్యత్తు ఏమిటి అనే అంశాలపై చర్చించుకోవాలన్నారు.
విభజన సమయంలో ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన చేశారన్నారు. తెలంగాణకు, ఏపీకి అన్యాయం చేయకుండా విభజన చేయాలని తాను సూచించానని చెప్పారు. సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలని, విభజన చేయాలంటే ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని కోరానన్నారు.
నాడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా.. విభజన బిల్లును ప్రత్యేకంగా విమానంలో పంపించారని గుర్తు చేశారు. ఇద్దరికీ నచ్చ చెప్పడం మాని, కాంగ్రెస్ పార్టీ వార్ రూంను ఏర్పాటు చేసి అడ్డగోలుగా విభజన చేసిందని అభిప్రాయపడ్డారు. విభజన వల్ల వచ్చే నష్టాలను తాను అప్పుడే చెప్పానన్నారు.
యూపీఏ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. నేను మొదటి నుంచి సమన్యాయం కోరానన్నారు. తెలంగాణ, ఏపీలకు న్యాయం చేసి ముందుకు వెళ్లాలని తాను ఎన్నిసార్లు చెప్పినా ఏకపక్షంగా ముందుకెళ్లారన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో సభలో గందరగోళం
విభజనకు ముందు నాడు లోకసభలో కాంగ్రెస్ పార్టీ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టి, ఆ తర్వాత విత్ డ్రా చేసుకుందని చంద్రబాబు అన్నారు. అలా ఎందుకు విత్ డ్రా చేసిందో వైసిపినే చెప్పాలన్నారు. నాడు ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటిలు అవిశ్వాసం నోటీసును వెనక్కి తీసుకున్నారన్నారు.
అవిశ్వాసం పైన తీర్మానం వెనక్కి తీసుకున్నారనే విషయం రికార్డుల్లో ఉన్న దానినే తాను చెబుతున్నానని చంద్రబాబు వివరణ ఇచ్చారు. విభజనకు వ్యతిరేకంగా తాము కూడా నాడు అవిశ్వాసం నోటీసు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.
తొలిసారి ఆర్టికల్ 3ని అమలు చేసింది ఏపీ విభజనతోనే అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసిపి నినాదాలు చేస్తుండటంతో సభాపతి కోడెల వారికి పలుమార్లు మౌనంగా ఉండాలని, మీకు సమయం ఇచ్చినప్పుడు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే అబద్దాలు చెప్పడం మీకు అలవాటు అని చంద్రబాబు అన్నారు. ఇష్టానుసారంగా ఇలా చేస్తే రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అన్నారు. మీకు అవకాశం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలన్నారు. నేను మీ పైన అభియోగం చేయలేదన్నారు.
యనమల స్పందన
ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పడం ఏమిటని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రతి దానికి వైసిపి అడ్డుపడుతోందన్నారు. మీరు ఓపికతో వినాలని, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలన్నారు. ప్రతిపక్షం తీరు సరిగా లేదన్నారు.
ప్రతి దానికి ప్రతిపక్షం అడ్డుపడటం సరికాదన్నారు. సభా కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశం విపక్షానికి లేదన్నారు. ఉదయం ప్రశ్నోత్తరాలు అంటే అడ్డుకున్నారని, ఇప్పుడు హోదాపై తీర్మానం చేస్తూ ప్రకటన చేస్తుంటే అడ్డుకుంటున్నారని, సభ జరగాలనే ఉద్దేశ్యం లేదా అని ప్రశ్నించారు.
సంప్రదాయాలు, రూల్స్, రాజ్యాంగం పాటించమని విపక్షం చెబితే అది నడవదన్నారు. సభాపతి ప్రకటన చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడిగే అవకాశం లేదన్నారు. తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడవచ్చునని చెప్పారు.
ప్రకటన కాపీలు ఇవ్వరా?: వైసిపి
సభలో చర్చ జరపకుండా ప్రకటన దేనికి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ప్రకటన కాపీలు కూడా తమకు ఇవ్వకుండా ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. కాగా, వారు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టారు.
ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మీ అనుమానాలు నివృత్తి చేస్తామని విపక్షానికి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. కావాలనే ప్రతి అంశాన్ని రాద్దాంతం చేయడం సరికాదన్నారు.
ఇదిలా ఉండగా, గందరగోళం మధ్య శాసన సభ మంగళవారానికి వాయిదా పడింది.