అంతా వ్యూహాత్మకమే!: బాబు మాస్టర్ ప్లాన్.., దాన్ని డైవర్ట్ చేయడానికే 'కాపు రిజర్వేషన్'
హైదరాబాద్: ఓ వివాదాన్ని సద్దుమణిగించాలంటే.. మరో వివాదాన్ని తెర పైకి తీసుకురావడం రాజకీయ చాణక్యం. ఇన్నాళ్లు నానుస్తూ వచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లును హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం ఈ చాణక్యానికి నిదర్శనం.
పోలవరం ప్రాజెక్టుపై హాట్ హాట్ చర్చ నడుస్తున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టించడం రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై నిందలు వినిపిస్తున్న తరుణంలో.. ఆ చర్చ లేకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా బిల్లును తెర పైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం వివాదం:
పోలవరం విషయంలో తాను చేయాల్సినంతా చేస్తున్నా.. కేంద్రం వైఖరి వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందనేలా చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఒకవిధంగా తప్పంతా ప్రధాని మోడీపైనే నెట్టేసే ప్రయత్నమిది.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమేముంది?. తీరా ఆ బాధ్యతలు తీసుకుని ఇప్పుడు కేంద్రం మీద నిందలు మోపితే లాభమేముంది?. ప్రాజెక్టు కేంద్రమే చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు చేసే ఆరోపణలకు జనంలో విశ్వసనీయత ఉండేది.
ఊహించినట్లుగానే చంద్రబాబు బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు
ఇలా సీన్ రివర్స్:
కేంద్రమే నిర్మించే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకీ భారాన్ని మోయాలన్న ప్రశ్న వేస్తే.. కేంద్రమైతే ప్రాజెక్టు ఆలస్యమవుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసుకోవచ్చన్న సమాధానాలు అప్పట్లో వినిపించాయి.
కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినా.. ఆ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఎడాపెడా ప్రాజెక్టు వ్యయం పెంచేస్తున్నారని కేంద్రం.. నిధులు రాకపోవడం వల్లే ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని ఇటు రాష్ట్రం ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో.. ఇంతకుముందు హామి ఇచ్చినట్లు 2018కల్లా ప్రాజెక్టు పూర్తి కాదు కాబట్టి చంద్రబాబు బంతిని నిర్మొహమాటంగా మోడీ కోర్టులోకి నెట్టేశారు.
ఆ చిక్కులు ఎందుకనే?:
పోలవరం ప్రాజెక్టు లెక్కలపై తొలి నుంచి కేంద్రానికి అనుమానం ఉంది. పనులు నత్తనడకన సాగుతుండటం.. ఎడాపెడా సబ్ కాంట్రాక్టర్లను నియమించడం.. దీని వెనకాల ఏదో జరుగుతోందన్న అనుమానాలను కలిగించింది.
దానికి తోడు సకాలంలో రాష్ట్రం నుంచి ఖర్చుల లెక్కలు కేంద్రానికి పంపించకపోవడం కూడా అనుమానాలను రెట్టింపు చేసిందన్న వాదన ఉంది. తాజాగా పోలవరంపై వివాదం నడుస్తుండటంతో.. బీజేపీ నేతలు అందులోని అవినీతిపై ప్రశ్నించే అవకాశం ఏర్పడింది. ఇదిలాగే కొనసాగితే లొసుగులు బయటపడే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే చంద్రబాబు దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీకి ఛాన్స్: ఒత్తిడిలో బాబు?.. పోలవరంపై ఇదంతా డ్రామా అన్న వైవీ సుబ్బారెడ్డి
అందుకే కాపు రిజర్వేషన్ల బిల్లు:
పోలవరం వివాదాన్ని తెర పైకి లేకుండా చేసేందుకే కాపు రిజర్వేషన్ల బిల్లును చంద్రబాబు తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే, ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే బిల్లుపై చంద్రబాబుకు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందనేది చాలామంది ప్రశ్న. దానికి తోడు బీసీ కమీషన్ మంజునాథ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. తనను సంప్రదించకుండానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంత హడావుడిగా ప్రభుత్వం ఇప్పుడీ బిల్లును ప్రవేశపెట్టడం పోలవరం వివాదాన్ని పక్కదోవ పట్టించడానికే అన్న ప్రచారానికి ఊతమిస్తోంది.
వ్యూహాత్మకంగానే బిల్లు:
కాపుల రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం చంద్రబాబు బంతిని మోడీ కోర్టులోకి నెట్టారు. తాము ఎంత చేయాలో అంత చేశామని, ఇక కేంద్రం పైనే అంతా ఆధారపడి ఉందని అంటారు. ఒకవేళ కేంద్రం అందుకు ఒప్పుకోకపోతే బాధ్యత తమది కాదు అని చెప్పడమే దీని ఉద్దేశం.
మరోవైపు అటు బీసీ సంఘాలు చంద్రబాబుపై భగ్గమంటున్నాయి. అయితే ఈ బిల్లు ఆచరణకు నోచుకోవడంపై చంద్రబాబుకు అనుమానాలు ఉన్నాయి కాబట్టే.. కాపు రిజర్వేషన్లను ఇంత ధీమాగా ముందుకు తీసుకొచ్చారన్న వాదన వినిపిస్తోంది.
బీసీలు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నా..కేంద్రం శైఖరి చూశాక వారే చల్లబడుతారని ఆయన భావించి ఉండవచ్చు. తద్వారా అటు బీసీలతో పేచీ ఉండదు.. కాపులు ఆగ్రహించినా.. కేంద్రం చేతిలో వ్యవహారానికి తానేమి చేయలేనని సైడ్ అయిపోయే అవకాశం ఉంది. మొత్తానికి కాపు రిజర్వేషన్ల బిల్లు వ్యవహారంలో చంద్రబాబు ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న మాట.