లక్ష కోట్లు తిన్న జగన్కు జైల్లో మర్యాదలు: బాబు
న్యూఢిల్లీ: లక్ష కోట్లు తిన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు జైలులో సకల మర్యాదలు చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ను విడిపించడంలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సిబిఐని ప్రయోగించి బెదిరిస్తారని, తర్వాత వారి పబ్బం గడుపుకుంటారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తమ పార్టీ అధిష్టానం జగన్తో ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెసు నాయకులే చెబుతున్నారని ఆయన అన్నారు.
దేశంలో జరుగుతున్న ప్రతి దుష్పరిణామానికీ ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలే బాధ్యులని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రధాని మన్మోహన్ సింగ్కు ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. మన్మోహన్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశం ఎంతో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో తాను రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను మాట్లాడనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అప్పుడు తాను మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి తానే గుర్తించినట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అన్ని విధాలా నిర్వీర్యం కాంగ్రెసు నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వ శక్తులు ఒడ్డి ఆ ఉద్యమాన్ని నీరుగార్చారని ఆయన అన్నారు. అన్నా హజారే ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. నేర చరితుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, దానికి తూట్లు పొడిచేందుకు యత్నిస్తున్నారని తప్పు పట్టారు. ఈ రోజున సిబిఐని కూడా పాడుచేశారని వ్యాఖ్యానించారు.
నేర చరిత్ర గలవారిని కాపాడడంకోసం చేసిన ఆర్డినెన్స్ను ఇప్పుడు రాహుల్ ఆక్షేపించడాన్ని ఆయన ఆక్షేపించారు. నేర చరితులు ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలులేదని తాము స్పష్టం చేశామని, తాను చాలా రోజుల నుంచి ఈ విషయమే చెబుతున్నానని ఆయన అన్నారు.