ముఖ్యమంత్రి చంద్రబాబు...త్వరలో బస్సు యాత్ర...?
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారా?...అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. బస్సు యాత్ర అనేది ఇతిమిద్దంగా ఖరారు కాకపోయినా జనంలోకి వెళ్లాలనే డెసిషన్ మాత్రం ఫైనల్ అయిందని అంటున్నారు.
రాష్ట్రంలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజల్లో టిడిపి పట్ల ప్రతికూల భావనలు తలెత్తకుండా తమ వాదన వినిపించేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, తాజా పరిణామాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలనే యోచన చేస్తున్నారట. అయితే హెలికాఫ్టర్ లో వెళ్లి రావడం కాకుండా బస్సు యాత్ర ద్వారా ఈ పర్యటనలు చేపడితే మరింత ప్రయోజనం పొందచ్చనేది టిడిపి నేతల వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టిడిపి గురించి వైసిపి,బిజెపి చేస్తున్న ప్రచారం సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగితే బాగుంటుందని ఇటీవల టిడిపి ముఖ్యనేతల సమావేశంలో కొందరు టిడిపి నేతలు చేసిన సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారట. అది కూడా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలు కాకుండా అన్ని జిల్లాలు తిరిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయిందట.
దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంలోకి వెళ్లే టూరు పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, బిజెపి, వైసిపిలు చేస్తున్న దుష్ప్రచారం వీటిన్నింటిని ఈ యాత్రలో చంద్రబాబే స్వయంగా ప్రజలకు వివరిస్తారని అంటున్నారు. దీంతో ప్రజల్లో ఏర్పడిన సందిగ్థత తొలిగి టిడిపికి సానుకూల వాతావరణం ఏర్పడాలంటే ఇదే కీలక సమయమని ఆ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.