కూతురుతో విమర్శలా.. ఫిర్యాదు: అఖిలకు బాబు క్లాస్! ఏవీ అసంతృప్తి వెనుక ఇదీ విషయం!!
అమరావతి: ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, వారి మధ్య వివాదం సమసిపోయేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి వారు కలిసి పని చేస్తామని చెప్పారు. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు.
Recommended Video
ఏ హోదాలో, నేను ఉండగా.. ఎలా?: చంద్రబాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!
అయితే, భేటీ సందర్భంగా అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అఖిలను, ఏవీ సుబ్బారెడ్డిని అమరావతికి పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ వివాదం అమరావతికి మారింది. శుక్రవారానికి చంద్రబాబు ముగింపు పలికారు. అయితే భేటీ సమయంలో బాబు ఆమెను మందలించారని సమాచారం.
కూతురుతో విమర్శలు చేయిస్తున్నారు
అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో చంద్రబాబు విడిగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నేతలు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో తనపై పోటీ రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురుతో తమపై విమర్శలు చేయిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
రాళ్ల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మరోవైపు, పార్టీ పటిష్టత కోసం తాను సైకిల్ యాత్ర చేపట్టానని, అఖిలప్రియ వర్గం తనపై రాళ్ల దాడికి దిగిందని ఏవీ సుబ్బారెడ్డి అధినేతకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి చంద్రబాబుకు ఆధారాలు కూడా సమర్పించారని తెలుస్తోంది. రాళ్ల దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
వాడిగా, వేడిగా భేటీ.. అఖిలకు క్లాస్
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారు. సీనియర్లను కలుపుకొని వెళ్లాలని అఖిలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే, ఏవీ సుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబుతో భేటీ లోపల వాడిగా, వేడిగా సాగినట్లుగా భావిస్తున్నారు.
అసలు విషయం ఇదీ!
ఇదిలా ఉండగా, నంద్యాల స్థానాన్ని ఏవీ సుబ్బారెడ్డి ఆశిస్తున్నారని, అందుకే విభేదాలు కనిపిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కూడా ఏవీ సుబ్బారెడ్డి ముభావంగానే ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన మాత్రం తాను కలిసి పని చేస్తానని వెల్లడించారు. అఖిలప్రియతో ఇబ్బంది ఉన్నా సీఎం చంద్రబాబు మాటే ఫైనల్ అన్నారు.
పిల్లలు క్షమించమన్నారు
భేటీ సందర్భంగా అందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. అఖిలప్రియ, మౌనిక పిల్లలు అని, వారు తప్పు చేసినా క్షమించి కలిసి పని చేసుకొని వెళ్లాలని తనకు చంద్రబాబు చెప్పారని తెలిపారు. వారికి కూడా అదే చెప్పారన్నారు. మీకు తండ్రిలంటి వాడు.. కలిసి పని చేయాలని అఖిలకు సూచించారన్నారు. లోపల నేను ఏం చెప్పాననేది విషయం కాదని, చంద్రబాబు చెప్పింది తాము చేస్తామన్నారు.