నీది చూసుకో!: అచ్చెన్నకు బాబు క్లాస్, రామోజీరావుకు జగన్ అభినందన
విజయవాడ: మంత్రి అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో తన శాఖను వదిలి ఇతర శాఖల విషయాలను చర్చించబోయిన అచ్చెన్నను చంద్రబాబు అడ్డుకున్నారు.
రోడ్లు భవనాల శాఖపై చర్చ సమయంలో.. అచ్చెన్నాయుడు కల్పించుకుని రహదారులు బాగాలేవని, తక్షణం మరమ్మతులు చేయాల్సి ఉందని చెప్పారు. నిధుల అవసరం ఉందన్నారు. అచ్చెన్నాయుడిని అడ్డుకున్న చంద్రబాబు.. తొలుత మీ శాఖ సంగతి చూసుకోవాలని, ఇతర మంత్రుల శాఖల్లో వేలెందుకని క్లాస్ పీకారట.
పంచాయతీ రాజ్ శాఖ నిర్వహిస్తున్న రహదారులను, ఆర్ అండ్ బీకి బదిలీ చేయాలని తాను చెప్పినా ఇంకా చేయలేదెందుకని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శాసన సభ సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే చర్చ కూడా కేబినెట్లో జరిగింది.
విజయవాడ సమీపంలోని ఓ ప్రయివేటు విశ్వవిద్యాలయంలో నిర్వహించుదామా.. అని చంద్రబాబు అడిగారని తెలుస్తోంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు హైదరాబాదులోనే నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు ఎక్కువమంది సూచించారని సమాచారం. మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు చంద్రబాబు కేబినెట్ మంత్రులకు చెప్పారు.
రామోజీ రావుకు జగన్ అభినందనలు
సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాల్లో విశేష సేవలందించినందుకుగాను పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావుకు వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సోమవారం అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు అందరికీ జగన్ అభినందనలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం జగన్... రామోజీ రావును కలవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.