తలనొప్పేంటి, అంతా తెలుసు, సారీ చెప్పండి: బాబు ఆగ్రహం, ముందే రిపోర్ట్..
విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమాచారం పూర్తిగా తెప్పించుకున్న చంద్రబాబు.. తనను కలిసిన టిడిపి నేతలు కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న తదిత
విజయవాడ: విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమాచారం పూర్తిగా తెప్పించుకున్న చంద్రబాబు.. తనను కలిసిన టిడిపి నేతలు కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న తదితరులకు క్లాస్ పీకారు.
నా బస్సులు ఆపేస్తా, జగన్ బస్సుల మాటేమిటి, సారీ: బాబు క్లాస్తో తగ్గిన కేశినేని
చంద్రబాబుతో టిడిపి నేతలు గంటసేపు భేటీ అయ్యారు. వారు వివరణ ఇచ్చినప్పటికీ.. విషయమంతా తెలుసునని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అధికార పార్టీ అంటే అరిటాకు లాంటిది అని చంద్రబాబు వారికి చెప్పారు. సీఎం ఇవాళా లేదా రేపు అధికారులతో భేటీ కానున్నారు.
ఈ తలనొప్పులు తేవొద్దు
ఈ రోజు మధ్యాహ్నం కేశినేని, బోండా ఉమ తదితరులు చంద్రబాబును కలిశారు. అప్పటికే సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ట్రాన్సుపోర్ట్ కమిషనర్ను కలిసి క్షమాపణ చెప్పాలని, ఇంతటితో వివాదానికి ముగింపు పలకాలని వారికి ఖరాఖండిగా చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకు వస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షమాపణ చెప్పారు
దీంతో టిడిపి నేతలు తగ్గారు. నిన్న (శనివారం) రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆ తర్వాత టిడిపి నేతలు తెలిపారు. తామెవరినీ దూషించలేదని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా పేర్కొన్నారు. జరిగిన ఘటనలో తమ తప్పుంటే క్షమాపణ చెప్పేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తమకు పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టే ముఖ్యమన్నారు. ఆ తర్వాత టిడిపి నేతలు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. రవాణా శాఖ కమిషనర్ను కలిసి క్షమాపణ చెప్పారు.
పెన్ డౌన్ హెచ్చరిక
అంతకుముందు, విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో శనివారం జరిగిన ఘటనకు ప్రజాప్రతినిధులు క్షమాపణ చెప్పకపోతే సోమవారం నాడు పెన్డౌన్ చేపట్టాలని అధికారుల సంఘం నిర్ణయించింది. రవాణాశాఖ కార్యాలయంలో సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు తీర్మానించారు. ఈ ఘటనకు దారితీసిన పూర్వాపరాల్ని రవాణా శాఖ సంయుక్త కమిషన్ ప్రసాదరావు వివరించారు.
నివేదిక మార్చాలని ఒత్తిడి... కేశినేనిపై ఆగ్రహం
ఆటో నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నివేదిక మార్చాలని కొందరు ఒత్తిడి తెచ్చారని, సాధ్యం కాదని కమిషనర్ చెప్పడంతో ప్రజాప్రతినిధులు కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేసినట్లు ప్రసాదరావు తెలిపారు.
రవాణాశాఖ అధికారులను అవినీతిపరులుగా వ్యాఖ్యానించిన వారు.. ఎవరికి ఎంతెంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ కేశినేని నానిపై అధికారులు తీవ్రంగా మండిపడ్డారు. ఒక బస్సు ప్రమాదం విషయంలో మరో బస్సు ఆపరేటర్ ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. ఐజీ స్థాయి అధికారిని రోడ్డుపై నిలబెడితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.