ముద్రగడ ఎఫెక్ట్: టిడిపి కాపు నేతలకు చంద్రబాబు క్లాస్?
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన, విధ్వంసం నేపథ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందిస్తున్నారు. తుని ఘటన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల పైన కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా, ఆయన పశ్చిమ జిల్లాకు చెందిన కాపు ప్రజాప్రతినిధుల పైన కూడా భగ్గుమన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని, మీ నియోజకవర్గాల నుంచే ఎక్కువ స్థాయిలో కాపులు, నేతలు తరలి వెళ్లారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు మంగళవారం నాడు కాపు సామాజిక వర్గానికి చెందిన టిడిపి ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతో మాట్లాడారు.
గతంలో కాపులను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు తన హయాంలో వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు వారితో చెప్పారు. మనతో పాటు కాంగ్రెస్, వైసిపిలు కూడా కాపులను బీసీల్లో చేర్చడానికి కమిషన్ వేస్తామని చెప్పాయని, ఇప్పుడు మనం అదే చేశామని చెప్పారు.
తొమ్మిది నెలలా, ముందేనా ఇప్పుడే చెప్పలేం: మంజునాథ్
విధివిధానాలు రూపొందించాక కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తమ కమిషన్ పని చేస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ అన్నారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై నివేదిక తొమ్మిది నెలల్లోనా, అంతకుముందే ఇస్తామా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.