ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ, కుట్రలు చేస్తే..?: కేంద్రం, బీజేపీకి చంద్రబాబు హెచ్చరిక
Recommended Video
విశాఖపట్నం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు.
'మనం న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ ధర్మపోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలందరికీ పాదాభివందనాలు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి విశాఖ ముఖద్వారం. దేనికి మనం పోరాటం చేస్తున్నామో అంతా ఆలోచించాలి. మన స్వార్థం కోసం కాదు. జాతి ప్రయోజనాల కోసం. భావితరాల భవిష్యత్తు కోసమే. బీజేపీ నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నాం. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నిలదీసేందుకు తొలి సభ తిరుపతిలో పెట్టాం. నాలుగేళ్ల కంటే ముందు అదే రోజున ప్రధాని అభ్యర్థిగా మోడీ హామీ ఇచ్చారు' అని అన్నారు.
అడ్రస్ గల్లంతేనంటూ హెచ్చరిక
‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాపై ఎందుకీ వివక్ష? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? మాకు ఇది జీవన్మరణ సమస్య. విశాఖ రైల్వేజోన్ మా హక్కు. దానికి అడ్డుచెబితే మీ అడ్రస్ గల్లంతే' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని హెచ్చరించారు.
29సార్లు వెళ్లినా..
‘తిరుపతిలో విశాఖలో, నెల్లూరులో, అమరావతిలో, నాటి ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారో విన్నారు. ఇచ్చిన హామీలు కేంద్రం నిలబెట్టుకోలేదు. కుట్రలు చేసేవాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి. మొద్దు నిద్ర పోతున్నారు. దాన్నుంచి లేపాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి. ఎందుకు మాకీ అన్యాయం? మేమూ ఈ దేశంలో భాగస్థులం. ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారని ఐదు కోట్ల ప్రజానీకం మిమ్మల్ని నిలదీస్తున్నారు. ఒకట్రెండు సమస్యలు కాదు. చట్టంలో పెట్టిన ప్రతిదాన్నీ తూ.చ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. 29సార్లు వెళ్లాను. అందరికంటే సీనియర్గా దేశ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నిసార్లు వెళ్లినా వారి మనస్సు మారలేదు. రాష్ట్రానికి న్యాయం జరగలేదు. ప్రత్యేక సాయం ఇస్తామని కూడా ఇవ్వకుండా మభ్యపెట్టారు. ఆ తర్వాత పారిశ్రామి రాయితీలు 11 రాష్ట్రాలకు ఇచ్చారు. నేను నిలదీశాను. సమాధానం చెప్పకుండా ఐదో బడ్జెట్లోనూ మోసం చేశారు. బడ్జెట్లో ఎక్కడా రాష్ట్రం పేరులేదు. ఎంపీలంతా ఒకేమాట చెప్పారు. కేంద్రం మోసం చేస్తోంది. తిరుగుబాటు తప్ప వేరే మార్గంలేదని ఎంపీలంతా ముక్తకంఠంతో చెప్పారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ పార్టీ లాలూచీ..
‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసింది లాలూచీ పోరాటం. లోపల మోడీపై విశ్వాసం.. బయట నాటకం అవిశ్వాసం అదీ వారి తీరు. ఏమైనా భయపడమని తెలుగు వారి బాధను పార్లమెంట్లో నినదించింది టీడీపీ ఎంపీలే. సాక్షాత్తు ప్రధాని ఇంటివద్దే నిరసన చేపట్టాం. కొట్టినా బాధపడలేదు. జాతికోసం పోరాడుతున్నామని ఎంపీలు పోరాటం చేశారు. ఏం చేసినా లక్ష్య పెట్టుకోలేదు' అని చంద్రబాబు అన్నారు.
అందుకే ఎన్డీఏ నుంచి బయటకు..
‘టీడీపీ నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల్ని రాజీనామా చేయాలని అడిగితే ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ముందుకొచ్చి రాజీనామాలు చేశారు. పదవులు టీడీపీకి తృణప్రాయం. పదవుల కోసం మేం లేం. వాజ్పేయీ ప్రభుత్వంలో 29మంది ఎంపీలు ఉంటే మంత్రి పదవులు తీసుకోకుండా వద్దని ఆరోజు నాటి ప్రభుత్వానికి సహకరించాం. ఎప్పుడైనా పదవులడిగామా? రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ తెదేపా. కనీసం ఎంపీల రాజీనామా తర్వాత ఆర్థికబిల్లు వచ్చింది. పొరపాటు జరిగిపోయింది సరిచేస్తామని చెప్పకుండా.. ధీమాతో ఏమైనా చేసుకోండి మేం పట్టించుకోబోమనే రీతిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రవర్తించారు. దీంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకొని అవిశ్వాస తీర్మానం పెడితే అనేక పార్టీలకు చెందినవారంతా మద్దతు తెలిపారు. 100 మంది ఎంపీలకంటే ఎక్కువగా చెప్పారు. అంతా పార్లమెంట్లో నిలదీశారు' అని చంద్రబాబు చెప్పారు.
పోలవరం నా జీవితాశయం
‘పోలవరం ఏపీకి జీవనాడి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదు.. ఆగదు.. ఆగే సమస్యే లేదు. ఇది మన హక్కులకు సంబంధించిన విషయం. కేంద్రం డబ్బులిస్తే 2019 నాటికి పూర్తిచేస్తాం. పోలవరం పూర్తి నా జీవితాశం. రాష్ట్రంలో కరవు లేకుండా చేయాలి. వాజ్పేయీ ఎక్కడ నదులు అనుసంధానం ఏడాది లోపల పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులు కలిపాం. పోలవరం ద్వారా గోదావరి కృష్ణా నదులు కలుపుతున్నాం. గోదావరి నది నీళ్లు పెన్నా నదికి తీసుకెళ్తాం. వంశధార నుంచిపెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఎక్కడ నీళ్లు లేకపోయినా నీటి ఎద్దడి తీర్చుకొనే బాధ్యత మేం తీసుకుంటాం. ఇన్ని పనులు చేస్తుంటే మొండిచేయి చూపిస్తున్నారు' అని చంద్రబాబు అన్నారు.
నన్ను నమ్మారు.. మెడలు వంచైనా..
‘రాజధాని నిర్మాణానికీ సహకరించట్లేదు. రాజధానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రెవెన్యూలోటు కింద మనకు రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కష్టం, శ్రమ మాది, ఆదాయం మీకు. 33వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారంటే అదీ వారికి నాపై ఉన్న విశ్వసనీయత. విశాఖ రైల్వేజోన్ను మెడలు వంచైనా సాధించుకుంటాం. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని చంద్రబాబు అన్నారు.
ఢిల్లీ స్క్రిప్టు చదువుతున్న పవన్.. ఖబడ్దార్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఢిల్లీ స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ-బీజేపీ ఆటలు సాగవన్నారు. కుట్ర రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 25ఎంపీలను టీడీపీకి ఇవ్వాలని, అలా అయితేనే హోదాతోపాటు ఇతర డిమాండ్లను సాధించుకోవచ్చన్నారు. అంతేగాక, ప్రధానిని కూడా నిర్ణయించే అవకాశం ఉంటుందని అన్నారు.