పవన్ రెచ్చగొడుతున్నారు, బీజేపీ మనిషిలా లక్ష్మీనారాయణ!: ఆపరేషన్ గరుడపై చంద్రబాబు
Recommended Video
అమరావతి: తనపై, తన పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, ఇతర వ్యక్తులపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పైనే విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపైనా సెటైర్లు వేశారు.
జూన్ 2 చీకటి రోజు, వేడుకెలా చేసుకుంటాం? అవమానం: మోడీని ఏకేసిన చంద్రబాబు
అప్పుడెందుకు మాట్లాడలేదు పవన్?
శనివారం ఉదయం నవనిర్మాణ దీక్ష చేసిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ విభేదించిన తర్వాత నుంచే తమపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
పవన్ రెచ్చగొడుతున్నారు
ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని పవన్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాత్రం ఆయన స్పందించడం లేదని అన్నారు. ఏపీని అస్థిరపరిచే కార్యక్రమాన్ని బీజేపీ చేస్తోందని, రాయలసీమ డిక్లరేషన్తో ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఆపరేషన్ గరుడ అమలవుతోంది..
చివరకు తిరుమలను కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. వారణాసికి, తిరుమలకు ఏ మాత్రం పోలిక లేదని, తిరుమల ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని చెప్పారు. రమణదీక్షితులతో టీటీడీపై ఆరోపణలు చేయిస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడను అమలు చేస్తున్నట్లే కనిపిస్తోందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీలో బీజేపీ కుట్ర రాజకీయాలను సాగనవివ్వబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు..
బీజేపీ మనిషిలా లక్ష్మీనారాయణ..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు విమర్శలు చేశారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఎవరు చెప్తే వాళ్లే సీఎం అవుతారని అంటున్నారని, ఇలా బీజేపీ రకరకాలుగా అందరినీ నడిపిస్తోందని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.