దెబ్బకు 4 పిట్టలా, సెల్ఫ్ గోలా? పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్కు ఛాన్స్ మిస్
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రయత్నం సఫలమా.. విఫలమా అంటే శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం తెలియనుందని అంటున్నారు. ఏపీ అంశాల విషయంలో టీడీపీ.. బీజేపీని ఇరుకున పెడుతుందా లేక తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా అనే అంశంపై ఆధారపడి ఉందని చెబుతున్నారు.
అలా అని ఎవరు చెప్పారు?: టీడీపీ అవిశ్వాసంపై సోనియా, '20న సత్తా చూపిస్తాం'
విభజన హామీలను తాము నెరవేర్చుతున్నామని బీజేపీ చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చనందునే ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నామని టీడీపీ చెబుతోంది. అయితే, ఇందుకు సంబంధించి బీజేపీ ఆధారాలు చూపిస్తే అవిశ్వాసంతో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని, కేంద్రం హామీలు నెరవేరలేదని తెలుగుదేశం నిరూపిస్తే బీజేపీకి ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుదెబ్బే అంటున్నారు.
చంద్రబాబు టార్గెట్ 2019
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమంగా జగన్ పుంజుకుంటున్నారని, మరోవైపు 2014లో అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేయడం, బీజేపీ దూరం కావడం వంటి అంశాలు టీడీపీకి మైనస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవిశ్వాసం అంశం ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు 2019 టార్గెట్గానే అవిశ్వాసానికి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్రెడిట్ టీడీపీ సొంతం చేసుకుందా?
ప్రత్యేక హోదాపై టీడీపీ ఎన్నోసార్లు మాటలు మార్చిందనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ, జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు అదే అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నాయి. ప్రత్యేక హోదాతో లాభం లేదని, ప్యాకేజీయే బెట్టర్ అని చంద్రబాబు, టీడీపీ చెప్పిందని, ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకొని, హోదాను గురించి మాట్లాడుతోందని మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటం ఏపీకి హోదా అంశంపై వైసీపీ, జనసేనలు పదేపదే నిలదీయడంతోనే టీడీపీ ఆ బాట పట్టిందని అంటున్నారు. మొదటి నుంచి ఆ రెండు పార్టీలు డిమాండ్ చేసినా.. ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు రావడం, అవిశ్వాసంతో ఆ క్రెడిట్ టీడీపీ సొంతం చేసుకుందని చెబుతున్నారు.
ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు, ఛాన్స్ కోల్పోయిన జగన్
చంద్రబాబు ఇప్పుడు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు కొట్టే పనిలో సకెస్స్ అవుతారా అనే చర్చ సాగుతోంది. అవిశ్వాసం సందర్భంగా బీజేపీని ఇరుకునపెడితే అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని, ఇటు ఏపీలో వైసీపీ, జనసేనల నోరు మూయించవచ్చునని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. జగన్ యువభేరీలు కూడా నిర్వహించారు. ఎంపీలు ఇటీవల రాజీనామా చేశారు. గత సమావేశాల్లో వైసీపీ కూడా అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల లోకసభలో ఏపీ సమస్యలు విన్నవించుకునే మంచి ఛాన్స్ను వైసీపీ కోల్పోయింది.
పవన్ ఇచ్చిన ఆయుధంతో ఆయననే కార్నర్!
అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీని కనుక టీడీపీ ఇరుకున పెడితే.. జనసేన చేసే విమర్శలకు కూడా గట్టి జవాబు అవుతుందని భావిస్తున్నారు. ఇంకో విషయమేమంటే అవిశ్వాస తీర్మానం అనే ఆయుధాన్ని తెరపైకి తెచ్చింది పవన్ కళ్యాణే. ఇప్పుడు అదే ఆయుధంతో టీడీపీ ఆయనను కార్నర్ చేసే అవకాశం దక్కించుకుందని భావిస్తున్నారు. అయితే బీజేపీని కార్నర్ చేస్తేనే ఫలితం ఉంటుంది.
బీజేపీకి దేశవ్యాప్తంగా మైనస్, కాంగ్రెస్కు ఎలాగైనా షాక్
బీజేపీ విషయానికి వస్తే ఏపీలో పెద్దగా ఆ పార్టీ ప్రభావం లేదు. ఇలాంటి సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రత్యేక హోదా కోసం ఇలా పోరు చేస్తుండటం టీడీపీకి ప్లస్ కాగా, బీజేపీకి మరింత దెబ్బ. ఏపీ విషయాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అవుతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే టీడీపీ అడగకున్నా మద్దతివ్వాల్సిన పరిస్థితి. అండగా నిలబడినా.. చట్టంలో అన్ని అంశాలను పేర్కొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీని నిలదీసే అవకాశముంది. మద్దతివ్వకుంటే కాంగ్రెస్కు మరింత నష్టం. కానీ కాంగ్రెస్ మద్దతిస్తుంది.