బాబు ఇలా, అఖిలప్రియ అలా, జగన్-శిల్పాలకు ఛాన్స్ లేకుండా పోయింది!
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయం సాధించింది. ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, మంత్రి అఖిలప్రియలు జోరుగా ప్రచారం చేశారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయం సాధించింది. ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, మంత్రి అఖిలప్రియలు జోరుగా ప్రచారం చేశారు.
మా ప్రాంతాలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, నంద్యాలకు వెళ్లాలని చంద్రబాబు
అయితే, ప్రచారం సమయంలో భూమా కుటుంబం వైసిపి అధినేత జగన్పై అప్పుడప్పుడు విమర్శలు చేసినప్పటికీ, పెద్దగా విరుచుకుపడలేదు. అదే శిల్పా మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక, చంద్రబాబు.. శిల్పాపై మాట్లాడినప్పటికీ, ఎక్కువగా జగన్నే టార్గెట్ చేశారు.
జగన్ను ఏకేసిన చంద్రబాబు
నంద్యాలలో ఉప ఎన్నికలకు ముందు చంద్రబాబు రెండు రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన తన ప్రచారంలో జగన్ను ఏకిపారేశారు. పదేపదే జగన్పై నిప్పులు చెరిగారు. శిల్పా సోదరులు కొందరు అమాయకులపై కేసులు పెట్టించారని, ఆయన మోసం చేశారని మాత్రం విమర్శించినప్పటికీ.. చంద్రబాబు ప్రధానంగా టార్గెట్ చేసింది జగన్నే.
అఖిలప్రియ ఇలా
అలాగే, మంత్రి అఖిలప్రియ, భూమా కుటుంబం.. శిల్పా సోదరులను టార్గెట్ చేశారు. జగన్ పైన కూడా విమర్శలు చేశారు. కానీ శిల్పాను టార్గెట్ చేసినంతగా చేయలేదు. అదే శిల్పా సోదరులపై దుమ్మెత్తి పోశారు.
జగన్ ఇలా
ఇక, వైయస్ జగన్ తన ప్రచారంలో పదేపదే చంద్రబాబును టార్గెట్ చేశారు. పార్టీ మారిన వారు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా అఖిలప్రియను విమర్శించడం తప్పితే, పెద్దగా భూమా కుటుంబంపై విమర్శలు చేసిన సందర్భాలు లేవు. పదేపదే చంద్రబాబును టార్గెట్ చేయడం, కాల్చివేత వంటి తీవ్ర విమర్శలు కూడా వైసిపి ఓటమికి కారణమనే వాదనలు వినిపించాయి.
శిల్పా సోదరుల ప్రచారం
శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిలు ప్రారంభంలో చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. పలు కారణాల వంటి వాటి వల్ల ప్రచారంలో కొద్ది రోజులు చురుగ్గా లేరు కూడా. భూమా నాగిరెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసేందుకు వైసిపికి పెద్దగా అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు.
వైసిపిపై దూకుడు
పదవుల్లో ఉన్నప్పుడు, తాము ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శిల్పా సోదరులు ఏం చేశారని భూమా ఫ్యామిలీ నిలదీసింది. కానీ అంతే దూకుడుగా శిల్పా సోదరులు నిలదీయడంలో సఫలం కాలేకపోయారని అంటున్నారు. అందుకు భూమా మృతి కారణంగా జరుగుతున్న ఎన్నికలు కావడమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.