తండ్రి దాష్టీకంతో ఒంటరైన లక్ష్మీప్రసన్న: ఉద్వేగంతో చంద్రబాబు కంటతడి
అమరావతి: అనంతపురంలో ఓ తండ్రి దాష్టీకంతో తల్లిని, ఇద్దరు చెల్లెళ్లను కోల్పోయి ఒంటరైన యువతి విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలించిపోయారు.
అమరావతి: అనంతపురంలో ఓ తండ్రి దాష్టీకంతో తల్లిని, ఇద్దరు చెల్లెళ్లను కోల్పోయి ఒంటరైన యువతి విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలించిపోయారు. ఆమెను చూసిన ఆయన ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
ఒంటరైన లక్ష్మీ ప్రసన్నకు బాబు అండ
తాడిపత్రిలోని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తన భార్య సులోచన, ఇద్దరు కుమార్తెలు ప్రత్యూష, సాయిప్రతిభలను మంగళవారం తెల్లవారుజామున అతి కిరాతకంగా హత్య చేశాడు బుధవారం ఉదయం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి పెద్ద కుమార్తె లక్ష్మీప్రసన్నకు తిరుపతి ఐఐఎంలో సీటు రావడంతో అక్కడ గది వెతుక్కునే క్రమంలో ఆ రోజు ఇంటికి రాలేదు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
తీవ్ర వేదనలో లక్ష్మీప్రసన్న
తీవ్ర ఆవేదనలో ఉన్న లక్ష్మీప్రసన్నను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి ముఖ్యమంత్రి సభ వద్దకు తీసుకొచ్చి ఆమె దీనస్థితిని వివరించారు. దీంతో ముఖ్యమంత్రి చలించిపోయారు.
నేనున్నానంటూ చంద్రబాబు..
ఆమెను దత్తత తీసుకుంటున్నానని, ఆమె బాగోగులు చూసుకుంటానని, అత్యున్నత చదువులకు పూర్తిగా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేగాక, అప్పటికప్పుడే రూ.20లక్షలు సహాయం ప్రకటించారు. ఇంట్లో సమస్యలు వస్తే ధైర్యంగా పరిష్కరించుకోవాలిగానీ, కర్కోటకంగా ప్రాణాలు తీయకూడదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ధైర్యంగా ఉండాలని..
బాగా చదువుతున్న ఇద్దరు అమ్మాయిలను చంపేయడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. లక్ష్మీప్రసన్నకు అమ్మ, నాన్నలా అండగా ఉంటానని, ఆమె చదువుకు ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఆర్థిక సాయం చేస్తానని చెప్పారని, తాను రూ.20 లక్షలను డిపాజిట్ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆమె బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని, ధైర్యంగా ఉండి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. లక్ష్మీప్రసన్న విషాదం గురించి విని ముఖ్యమంత్రి కదిలిపోయారు. ఈ దారుణాన్ని వింటుంటే నోటమాట రావడంలేదని గద్గద స్వరంతో చెప్పారు. అంతకుముందు లక్ష్మీప్రసన్న తన విషాదగాథను వివరించారు.
దారుణంగా చంపేశాడంటూ ప్రసన్న
‘అమ్మ, ఇద్దరు చెల్లెళ్లను మా నాన్న ఘోరంగా చంపాడు. వారి తలలపై సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్లతో గుచ్చి చంపాడు. చిన్న చెల్లి తప్పించుకోవాలని చూస్తే నోరు నొక్కి తలలో స్క్రూడ్రైవర్ గుచ్చి చంపాడు. అతను మా నాన్న అని చెప్పుకోవడానికీ సిగ్గుగా ఉంది. నాన్నను కలిసి ఎందుకిలా చేశావని అడుగుదామనుకున్నా. ఇపుడు ఆయన కూడా లేడు. అంతా చనిపోయాక నేను ఎందుకు ఉండాలి? ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇంతలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, నన్నపనేని రాజకుమారి, బంధువులు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు' అంటూ కన్నీటి పర్యంతమైంది లక్ష్మీ ప్రసన్న. తాను ఐఐఎం చేయాలంటూ తల్లి ఎప్పుడూ కోరుతుండేదని, ఇపుడు ఆ కోర్సు చేసి తల్లి ఆశ నెరవేరుస్తానని లక్ష్మీప్రసన్న తెలిపింది. సభలో పాల్గొన్నవారినీ ఈ విషాదం కంటతడి పెట్టించింది.